విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు | Discourses on Education Reforms | Sakshi
Sakshi News home page

విద్యా సంస్కరణలపై వక్రభాష్యాలు

Oct 13 2023 4:59 AM | Updated on Oct 13 2023 10:17 AM

Discourses on Education Reforms - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యా సంస్కరణలపై రాజకీయ విష ప్రచారం జరుగుతోందని విద్యా­­శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పేదింటి బిడ్డలను అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభు­త్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంటే.. ఎల్లో మీడియా, విపక్షాలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వక్రభాష్యం పలుకుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.

ఎల్లో మీడియా రాతల ఆధారంగా సెలబ్రెటీ పార్టీ (జన­సేన) టోఫెల్‌ శిక్షణపై కాకిలెక్కలతో బహిరంగ లేఖ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. బైజూస్, టోఫె­ల్‌పై ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయి. బహిరంగ లేఖ రాసే ముందు కొంచెమైనా వాస్తవా లు ధ్రువీకరించుకోవాలి.

దావోస్‌ పర్యటనలో భాగంగా ఏపీ విద్యా సంస్కరణల్లో సీఎం జగన్‌ విజన్‌ నచ్చి.. బైజూస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఉచితంగా కంటెంట్‌ అందించేందుకు ముందుకొచ్చి­ంది. బైజూస్‌ ఒప్పందంలో ఎక్కడా ఆర్థిక లావాదేవీలకు చోటులేదు. ఆ తర్వాత  5.18 లక్షల ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా అందించాం. దీనివల్ల 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.

ఒక్కో విద్యార్థికి టోఫెల్‌ టెస్టు ఫీజు రూ.7.50 మాత్రమే..
విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పెంచేలా టోఫెల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌ (ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసు)తో ఒప్పందం చేసుకుని ప్రభుత్వ పాఠశాలల్లోని 3–9వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ ప్రైమరీ, జూనియర్‌ శిక్షణ ఇస్తున్నాం. ప్రైమరీలో 6.31లక్షలు, జూనియర్‌లో 14.39లక్షల మంది విద్యార్థులు కలిపి మొత్తం 20.70 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నాం. ఒక్కో విద్యార్థికి ఆన్‌లైన్‌ టెస్టు ఫీజు కింద కేవలం రూ.7.50 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది.

ఇందుకు రూ.1.50 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఇందులో అర్హత సాధించిన వారిలో ఆ తర్వాతి దశలో ప్రైమరీ, జూనియర్‌ విభాగాల్లో 40వేల మంది చొప్పున మాత్రమే ఓరల్‌ టెస్టు (సర్టిఫికేషన్‌)కు హాజరవుతారు. వీరికి టోఫెల్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్‌ కోసం రూ.600 చెల్లిస్తాం. ఇందుకు రూ.4.80 కోట్లు వెచ్చిస్తున్నాం. ఈ లెక్కన తొలి ఏడాది రూ.6.35 కోట్లు మాత్రమే టోఫెల్‌ శిక్షణకు ఖర్చుచేస్తున్నాం. కానీ, ఎల్లో మీడియా, సెలబ్రెటీ పార్టీ మాత్రం ఏ లెక్కన రూ.వెయ్యికోట్లు అవుతుందని రాస్తున్నారో చెప్పాలి.

2027–28 నాటికి రూ.145కోట్లే ఖర్చు..
ఇక విద్యార్థులకు టోఫెల్‌లో రెండో ఏడాది నుంచి జూనియర్‌ స్పీకింగ్‌ టెస్టు ఉంటుంది. ఇందుకు రూ.2, 500 చెల్లిస్తాం. 5వేల విద్యార్థులతో స్పీకింగ్‌ టెస్టు మొదలుపెట్టి ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుతాం. ఇంతచేసినా 2027–28 నాటి కి టోఫెల్‌ శిక్షణకు రూ.145 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. అలాగే, తమ ప్రభుత్వంలో నాణ్యమైన ఇంటరాక్టీవ్‌ ప్యాన్సల్‌ను రూ.1.25లక్షలకు కొనుగోలు చేయగా.. టీడీపీ హయాంలో రూ.3 లక్షల నుంచి రూ.4లక్షలు వెచ్చించినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడలేదు.

3,295 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్‌..
ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేస్తున్నాం. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి మొత్తం 3,295 అధ్యాపక పోస్టులకు సోమవారం నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. డీఎస్సీపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్‌ విశాఖ కేంద్రంగా ఉంటూ పర్యవేక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాయ­లసీమ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. వచ్చే ఉగాదికి టీడీపీ, సెలబ్రిటీ పార్టీ రాష్ట్రంలో వాష్‌ అవుట్‌ అవడం ఖాయం. ఇక లోకేశ్, పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి తమ బాధలు చెప్పుకోవడంలో తప్పేముంది. వాళ్ల కలయిక మా పార్టీకి చర్చనీయాంశం కాదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement