విశాఖ: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతు కావడం బాధాకరమని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో.. కేవలం ఒక్కరి ఆచూకీ మాత్రమే లభించిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ ని కనుగొనాలని అన్నారు. బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
కాగా, వైఎస్సార్సీపీ నేతల బృందం ఆదివారం ఫిషింగ్ హార్బర్కు వెళ్లి పరిశీలించింది. బాధిత మత్స్యకార కుటుంబాలను విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వైసీపీ నేతలు పరామర్శించారు.
ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ‘‘గల్లంతయిన వారికోసం ప్రభుత్వం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా చేయాలి. సమాచారం అందిన వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే మత్స్యకారుల ఆచూకీ దొరికేది. బాధిత మత్స్యకార కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుంది. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని మత్స్యకారులు చెబుతున్నారు’’ అని తెలిపారు.


