జర్నలిస్టులు ప్రశ్నిస్తే కక్ష సాధింపులెందుకు?: బొత్స | Ysrcp Leader Botsa Satyanarayana Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులు ప్రశ్నిస్తే కక్ష సాధింపులెందుకు?: బొత్స

Jul 4 2026 7:40 PM | Updated on Jul 4 2026 7:51 PM

Ysrcp Leader Botsa Satyanarayana Fires On Chandrababu

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రజల బాగోగుల్ని చూసుకోవాల్సిన ప్రభుత్వం, పాలనను గాలికొదిలేసి, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్, కేవీ రెడ్డి అరెస్టులే ఇందుకు నిదర్శమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖలో మండిపడ్డారు. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేదా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తద్వారా మహిళల్ని చంద్రబాబు కించపర్చారని ఆయన ఆక్షేపించారు. మీడియా సమావేశంలో బొత్స ఇంకేమన్నారంటే..

ప్రశ్నించిన వారిపై కూటమి సర్కార్ కక్షసాధింపులు
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా ? ప్రజల బాగోగుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం దురదృష్టవశాత్తూ ఆలోచన లేకుండా పోతోంది. ఎంతసేపూ రావణ్, కేవీ రెడ్డి వంటి యూట్యూబర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపులకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లాకప్ డెత్ లు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలతో జనం నరకం అనుభవిస్తున్నారు. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. యూరియా దొరకని పరిస్ధితులు ఉన్నాయి.

ఇవన్నీ వదిలేసి ప్రశ్నించే వ్యక్తుల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, అసలు హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తుంటే, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారు. జరిగిపోయిన వాటికే మళ్లీ మళ్లీ శంకు స్థాపనలు, భూమిపూజలు చేసుకుంటున్నారు. ప్రజల సమస్యల్ని మాత్రం గాలికొదిలేశారు. రెండేళ్ల పాలన దాటిపోయింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేశామని గర్వంగా చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా ? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో శంఖుస్ధాపన చేసిన స్టీల్ ప్లాంట్ కు రెండేళ్లుగా మౌనంగా ఉండిపోయి ఇప్పుడు మళ్లీ భూమిపూజలు చేస్తున్నారు.

రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారు
ఎంతసేపూ వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్సీపీ నాయకుల మీద ప్రభుత్వం వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతోంది. ఈ రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. ఏం చేశారంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. పెన్షన్ పెంపు మినహా మరే కొత్త పథకం అమలు చేయలేదు. ఈ డబ్బంతా ఎటు పోయిందో తెలియదు. మహిళల్ని బస్సులు ఎక్కించారు కానీ సున్నా వడ్డీలు మాత్రం ఎగ్గొట్టారు. ఆ బస్సులు సైతం స్ధానికంగా తిరగడానికి మాత్రమే, దూర ప్రాంతాలకు కాదు. కేంద్ర విద్యా మంత్రి స్కూళ్లకు వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ లు చూసి ప్రశంసించారంటే కారణం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలే.

కూటమి ప్రభుత్వం  విద్యార్థులకు ఇంకా స్కూల్ కిట్లే ఇవ్వలేదు. అమరావతిలో అవినీతి జరుగుతోంది, మావిగనే మా విధానం అని మా నాయకుడు వైఎస్‌ జగన్‌ చెప్పారు. అది నిజం. రాజధాని అంటే హైదరాబాద్. ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఎన్ని లక్షల చదరపు మీటర్లో ఉందో చూడండి. అంత పెద్ద రాజధాని. అమరావతి మాత్రం గీత గీసుకుని కూర్చున్నట్లుంది.  అందుకే మావిగన్‌ను వైఎస్‌ జగన్‌ తెరపైకి తెచ్చారు.

మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించే తీరిక లేదా?
గిరిజన మహిళ రాష్ట్రపతి అయిందంటే మేం అంతా సంతోష పడ్డాం. కానీ ఇప్పుడు ఆమె రాష్ట్రానికి వస్తే స్వాగతం చెప్పకపోవడానికి ముఖ్యమంత్రి వెళ్లకపోవడం మహిళల్ని కించపర్చడం కాదా? రాష్ట్రపతిని స్వాగతించి వెళ్లిపోవచ్చు కదా. గవర్నర్, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం కచ్చితంగా వెళ్లాలి. ఆరోగ్యం బాగోలేకపోతే అది వేరు. కానీ రాష్ట్రంలోనే ఉండి చంద్రబాబు వెళ్లలేదు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఇక్కడి ఉపముఖ్యమంత్రి మీటింగ్‌లో ఉన్నారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న వారు వచ్చినప్పుడు గౌరవించాలన్న మర్యాద కూడా లేదు. వీళ్లు రాష్ట్రం గురించి, న్యాయం, ధర్మం గురించి, గౌరవాల గురించి  బాధపడిపోతూ ఉంటారు. పాలన గాలికొదిలేసి ఎంతసేపూ కక్షసాధింపులకు దిగుతున్నారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడితే అప్పుడు చర్యలు తీసుకోవాలి కానీ భావప్రకటన స్వేచ్ఛనే కాలరాస్తామంటే ఎలా ? అవే మాటలు మనం మాట్లాడితే ఒప్పు, ఇతరులు మాట్లాడితే తప్పంటే ఎలా ? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ..
గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు తన స్థలంలో వైఎస్సార్సీపీ ఆఫీసు కట్టారని రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి? గవర్నర్ పదవే ఆయనకు చివరిది. రాజ్యాంగ పదవిలో ఉంటూ గౌరవం ఎందుకు తగ్గించుకుంటున్నారు? చంద్రబాబు విశాఖలో సింగపూర్ టౌన్ షిప్‌ను అక్కడి మీ పార్ట్‌నర్స్‌తో కడతారా లేక అక్కడి ప్రభుత్వంతో కడతారా చెప్పాలి. గతంలో అమరావతిలో సింగపూర్ సహకారంతో ఏదో చేస్తానన్నారు. మేం అధికారంలోకి వచ్చాక అక్కడి ప్రభుత్వాన్ని అడిగితే మాకూ, దీనికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు సింగపూర్ టౌన్ షిప్ ఎవరి సహకారంతో చేపడుతున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఎస్ఐఆర్ నమోదు 36 శాతం దాటలేదు కాబట్టి, గడువు మరో నెల పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement