ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు | Delhi HC Summons To Eenadu Andhrajyothy On Jagan Petition | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పరువు నష్టం దావా: ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

Dec 9 2024 4:26 PM | Updated on Dec 9 2024 5:11 PM

Delhi HC Summons To Eenadu Andhrajyothy On Jagan Petition

ఢిల్లీ, సాక్షి:  తెలుగు మీడియా సంస్థలైన ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్‌ వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఈ రెండు మీడియా సంస్థలు అడ్డగోలుగా కథనాలు రాశాయి. అయితే అవి నిరాధారమైన కథనాలుగా పేర్కొంటూ.. పరువు నష్టం దావా వేశారు వైఎస్‌ జగన్‌. 

అదానీ గ్రూప్‌ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెబుతున్నారు. ఈ మేరకు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. 

అయితే జగన్‌ ఇచ్చిన గడువు ముగిసినా.. ఆ రెండు మీడియా సంస్థల నుంచి స్పందన లేదు. దీంతో చెప్పినట్లుగానే లీగల్‌ నోటీసులు పంపించారు. ఇక తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు వైఎస్‌ జగన్‌.  ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు..  ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు సమన్లు జారీ చేసింది. అయితే సమన్ల తర్వాత పిటిషనర్‌పై ప్రచురించే కథనాలపై పరిణామలు తుడి తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేస్తూ.. విచారణను  ఢిల్లీ హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.

ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

కాగా, రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49 చొప్పున కేంద్రంతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. టీడీపీ తోక పత్రికల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అసత్య కథనాలు ప్రచురించాయని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని, థర్డ్‌ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని ఆది నుంచి తమ క్లయింట్‌ స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. 

సెకీ ఐఎస్‌టీఎస్‌ (అంతర్రాష్ట్ర సరఫరా) చార్జీలు మినహాయింపు ఇచ్చిందని.. ఆ మేరకు ఒప్పంద పత్రాలు, సెకీ రాసిన లేఖ ప్రతులను చూపిస్తున్నా సరే ఆ పత్రికలు పట్టించుకోకుండా నిరాధారంగా తమ క్లయింట్‌ గౌరవ ప్రతిష్టలను దెబ్బ తీస్తూ, ఉద్దేశ పూర్వకంగా తప్పుడు కథనాలు ప్రచురించాయని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఈ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, దానిని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావాకు వెళ్లారు.

 

Advertisement
 
Advertisement
Advertisement