
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 33 లక్షలమంది నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చుచేయడాన్ని ఆహ్వానిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. విజయవాడలో ఆదివారం సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ వర్ధంతి నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలను ఆహ్వానిస్తామని సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
అమరావతిలో నిర్మించిన 5,600 ఇళ్లను, రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 56 వేల టిడ్కో ఇళ్లను పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని కోరారు. సుబాబుల్ రైతుల సమస్యలపై ఈ నెల 10న ఛలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని రైతు సంఘాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, పార్టీ నాయకులు జి.ఓబులేసు, కె.వి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.