Construction Of 68 New Sub Stations For Power Requirements - Sakshi
Sakshi News home page

విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా 68 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం

Jun 16 2023 5:33 PM | Updated on Jun 16 2023 6:02 PM

Construction Of 68 New Sub Stations For Power Requirements - Sakshi

అమరావతి:  విద్యుత్ పంపిణ సంస్థలు పంపిణీ నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 

ఇపిడిసిఎల్ పరిధిలో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. 

జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలి. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఇపిడిసిఎల్ లోనూ ఆన్‌లైన్ లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 

విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలి. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలి. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. ఈదరు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు. 

గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు.

ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యంను మెరుగుపరుచుకుంటే, సబ్ స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ లైన్ల నిర్మాణంను కూడా ప్రణాళికాయుతంగా చేపడుతున్నామని తెలిపారు.  ఈ సమావేశానికి ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, జెన్కో ఎండి కెవిఎన్ చక్రథర్ బాబు, ఇపిడిసిఎల్ సిఎండి పృథ్వితేజ్ తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement