విశాఖ: సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారుల బోటు ప్రమాదానికి గురైన ఘటనపై ఫిషరీస్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బోటు ప్రమాదం జరిగిన విషయం 5వ తేదీ ఉదయం తెలిసిందని, అప్పుడే జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ వాళ్లకు లేఖలు రాశామన్నారు. సెర్చ్ ఆపరేషన్ చేయాలని వారిని కోరినట్లు తెలిపారు. విశాఖ కోస్ట్ గార్డ్ షిప్ రిపేర్లో ఉంటే కాకినాడ నుంచి రప్పించామన్నారు.
ఇప్పటివరకూ ఏ ఒక్కరి ఆచూకీ లభ్యం కాలేదని,సెర్చ్ ఆపరేషన్ మాత్రం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటు ప్రమాద ఘటనపై త్రీమెన్ కమిటి వేస్తామన్నారు. కమిటీ నివేదికను బట్టి ముందుకు వెళతామన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్న అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన మిగిలిన మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్లారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్కరి ఆచూకీ లభించకపోగా, సెర్చ్ ఆపరేషన్ ఈరోజు(మంగళవారం, జూలై7వ తేదీ) సాయంత్రానికల్లా ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ చెప్పడం మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.


