
నరసాపురంలోని ఏపీ ఫిషరీ యూనివర్సిటీకి నిర్లక్ష్యపు గ్రహణం
కూటమి నిర్వాకం వల్ల ఏడాదిగా నిలిచిన వర్సిటీ నిర్మాణం
రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే కళాశాల నిర్వహణ
సెకండ్ బ్యాచ్కు గదుల్లేక ఆర్బీకేలో తరగతులు
హాస్టల్ వసతి లేక విద్యార్థుల ఇక్కట్లు
సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఏర్పాటు చేసిన ఫిషరీ యూనివర్సిటీ వసతుల్లేక సతమతమవుతోంది. మత్స్య విద్య ఏటికేడు ఎదురీదుతోంది. దీనికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీని మంజూరు చేశారు. రాష్ట్రంలో ఇది రెండో ఫిషరీ యూనివర్సిటీ. యూనివర్సిటీ క్యాంపస్ కోసం నరసాపురం పక్కనే 40 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేసింది.
రెండేళ్లుగా తాత్కాలిక భవనంలోనే
తొలుత ఏడాది కాలానికి నరసాపురంలోని తుపాను షెల్టర్ భవనంలో తాత్కాలికంగా 66 సీట్లతో 2023 జూన్లో నాలుగేళ్ల కాలపరిమితి కలిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ కోర్సును ప్రారంభించారు. 2024 నాటికి క్యాంపస్లో తరగతులు నిర్వహించాలన్న లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది మార్చి నాటికే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, కళాశాల భవనాలు శ్లాబ్ దశకు చేరుకోగా, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాల పునాదులు పూర్తయ్యాయి.
దాదాపు రూ.35 కోట్ల విలువైన పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలను అటకెక్కించింది. నిధులివ్వకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండేళ్ల నుంచి తాత్కాలిక భవనంలోనే తరగతులను నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్బీకేనే తర‘గతి’..!
రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) నుంచి వస్తున్న వీరంతా రైతులు కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏపీ ఫిషరీ యూనివర్సిటీ విద్యార్థులు వీరు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏడాది కాలంగా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కళాశాల నిర్వహిస్తున్న తాత్కాలిక భవనంలో సెకండ్ బ్యాచ్ విద్యార్థులకు గదుల్లేవు. ఫలితంగా పక్కనే ఉన్న ఆబీకే భవనంలోని చాలీచాలని హాల్లోనే వీరికి తరగతులు నిర్వహించారు.
ఆర్బీకే భవనంలో సెకండ్ బ్యాచ్
ప్రస్తుత తాత్కాలిక భవనంలోని 12 గదులు 66 మంది స్టూడెంట్స్ కలిగిన ఒక బ్యాచ్కు మాత్రమే తరగతులు, ల్యాబ్ నిర్వహణకు సరిపోతున్నాయి. 2024 జూలై నుంచి మరో 66 మందితో సెకండ్ బ్యాచ్ మొదలు కావడంతో పక్కనే ఉన్న ఆర్బీకే భవనంలోని హాల్ను తరగతి గదిగా, స్టాఫ్ రూమ్ను కంప్యూటర్ ల్యాబ్గా వినియోగిస్తుండటం గమనార్హం.
ప్రైవేటు మెస్లు, అద్దె గదులే గతి!
క్యాంపస్ హాస్టల్ లేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు మెస్లు, అద్దె గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. గదులను బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చవుతోంది. విద్యార్థినులు భద్రతాపరంగా ఆందోళన చెందుతున్నారు. కళాశాలకు వచ్చే వెళ్లే దారిలో ఆకతాయిల బెడద ఎక్కువగా ఉంటోందని చెబుతున్నారు. కళాశాల వద్ద క్రీడా మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
సెక్యూరిటీ లేదు
క్యాంపస్ హాస్టల్ సదుపాయం లేక బయట అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. భద్రతాపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆకతాయిల బెడద ఉంటోంది. – సి.ధరణి, కర్నూలు, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని
హాస్టల్ వసతి కల్పించాలి
ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. క్యాంపస్ హాస్టల్ ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. యూనివర్సిటీ భవనాలు వేగంగా పూర్తిచేయాలి. క్రీడా మైదానం, ల్యాబ్ వసతులు కల్పించాలి. – దేవీ ప్రసాద్దొర, పార్వతీపురం, మొదటి సంవత్సరం విద్యార్థి
కొత్త బ్యాచ్ పరిస్థితి ఏమిటి?
సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 132 మంది ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరానికి జూలై నుంచి 66 మందితో ఫస్ట్ ఇయర్ సీట్ల భర్తీ జరగనుంది. కొత్త బ్యాచ్కు అక్టోబరులో తరగతులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో వీరికి క్లాసులు ఎక్కడ నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. స్థానికంగా ప్రైవేట్ విద్యాసంస్థలో తరగతుల నిర్వహణకు యత్నాలు జరుగుతున్నట్టు కళాశాల వర్గాలు చెబుతున్నాయి.