అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది: సీఎం జగన్‌

CM YS Jagan Speech In AP Assembly Sessions - Sakshi

కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట

36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్‌లు

మహిళల భద్రతలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ

సాక్షి, అమరావతి: రాజకీయాలకు తావులేకుండా సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ప్రభుత్వం మనదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై చర్చలో భాగంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళా సాధికారతపై చర్చకు చంద్రబాబు వస్తారేమో అని అనుకున్నాం. ఆలస్యం చేసినా ఇంతవరకు రాలేదు. కుప్పం ఎఫెక్ట్‌తో చంద్రబాబు రాలేదని మావాళ్లు అంటున్నారు. అక్కాచెల్లెమ్మలకు మంచి చేసే ప్రభుత్వం మాది. అమ్మ ఒడి పథకం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాం. రాష్ట్రంలో 61 లక్షా 73 వేల పెన్షన్లు అందిస్తున్నాం. అందులో 36 లక్షల 70వేల మంది మహిళలకు పెన్షన్‌ ఇస్తున్పాం. నెలకు రూ. 1500 కోట్లకు పైగా పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం. సూర్యోదయం కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నాం. గతంలో ఎన్నికలకు ముందే పథకాలు అమలయ్యాయి.

చరిత్రలో తొలిసారి ఎస్‌ఈసీగా మహిళ
'అక్కాచెల్లెమ్మలను ఆదుకునేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకం తీసుకొచ్చాం. అదనపు ఆదాయం పొందేలా వ్యాపారాలకు ప్రోత్సాహకాలు ఇచ్చాము. 3.40 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం. 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలను కోర్టులకు వెళ్లి, కేసులు వేసి ఆపాలని చూశారు. మంచి పథకాలు ఆపాలని చూడటం ధర్మమేనా?. అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు. సున్నా వడ్డీ పథకం ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా 24.56 లక్షల మందికి రూ.8,944 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం ద్వారా మహిళలకు అండగా నిలబడ్డాం. 3లక్షల 28 వేల మందికి రూ.982 కోట్ల మేర మేలు చేశాం. ఈబీసీ నేస్తం అనే కొత​ పథకానికి శ్రీకారం చుడతాం. వచ్చే జనవరి 9 నుంచి ఈబీసీ నేస్తం అమలు చేస్తాం. కేబినెట్‌లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేశాం. చరిత్రలో తొలిసారిగా ఎస్‌ఈసీగా మహిళను నియమించాం. 

మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
జగనన్న విద్యాదీవెన ద్వారా 18లక్షల 81వేల మందికి రూ.5,573కోట్లు చెల్లించాం. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 30లక్షల 16వేల మందికి మేలు కలుగుతోంది. 77 గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాన్ని చేపట్టాం. మహిళల భద్రతకు దిశా చట్టం తీసుకొచ్చాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. దిశా యాప్‌ ద్వారా 6,880 మందిని పోలీసులు కాపాడారు. మద్య నియంత్రణ కోసం పూర్తిగా బెల్ట్‌షాపులు తొలగించాం. మద్యం పట్టుకుంటే షాక్‌ కొట్టేలా ధరలు పెంచాం. మహిళల భద్రత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు వ్యవస్థను తీసుకొచ్చాం. మహిళలపై నేరం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. మహిళల భద్రతపై ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top