గడప గడపకు పనులు 'నెలలో మొదలు'

CM YS Jagan In Spandana Video Conference on Jagananna Colonies - Sakshi

ప్రాధాన్యతగా చేపట్టాలని స్పందనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

అక్టోబర్‌ 25న సచివాలయాల్లో ఈ–క్రాప్‌ జాబితాలు 

డిసెంబర్‌ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి లక్ష్యం

జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు.. 1.5 లక్షల టిడ్కో ఇళ్లు 

కొత్త లబ్ధిదారులకు ఫేజ్‌ 3 కింద డిసెంబర్‌లో ఇళ్ల మంజూరు

ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు

అక్టోబర్‌ 26న రైతు భరోసా రెండో విడత సాయం, ఇన్‌పుట్‌ సబ్సిడీ 

నవంబర్‌ 10న విద్యార్థులకు వసతి దీవెన 

స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత బాగుంది

అర్జీదారులకు ముందుగానే ఫోన్‌ ద్వారా విచారణ వివరాలు

దరఖాస్తుదారుడితో లొకేషన్‌లో సెల్ఫీ అప్‌లోడ్‌ 

సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో నెల రోజుల్లోగా ప్రాధాన్యత పనులు ప్రారంభం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ–క్రాప్‌ జాబితాలను అక్టోబర్‌ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్‌ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్‌ – 3 కింద డిసెంబర్‌లో ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని, వాటి ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్‌ 26న రైతు భరోసా రెండో విడత సాయంతో పాటు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా విడుదల చేస్తామని తెలిపారు. వసతి దీవెన నవంబర్‌ 10న విడుదల చేస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

నెలలో ఆరు సచివాలయాలు..
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి ఆలస్యం, అలసత్వానికి తావు ఉండకూడదు. 15,004 సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తున్నాం.

ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అంతా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యేలు కనీసం రెండు రోజుల పాటు సంబంధిత సచివాలయంలో గడిపి ప్రతి ఇంటినీ సందర్శించాలి.  ఒక రోజులో కనీసం 6 గంటల పాటు గడప గడపకూ నిర్వహించాలి. మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా అంతే సమయం గడపాలి.

పక్కాగా ఈ–క్రాపింగ్‌ 
ఈ– క్రాప్‌ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. పొరపాట్లకు తావులేకుండా నూరు శాతం పూర్తి చేయాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఈ సీజన్‌లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకోవడం, వివరాల నమోదు సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్‌ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి. అక్టోబరు 3లోగా ఇది పూర్తి చేయాలి. రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ– క్రాప్‌ డిజిటల్‌ రశీదులు, ఫిజికల్‌ రశీదులు ఇవ్వాలి.

అక్టోబరు 15 లోగా అది పూర్తి చేసి సోషల్‌ ఆడిట్‌ చేపట్టాలి. అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు ఇ–క్రాప్‌ తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1 నుంచి తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ షెడ్యూల్‌ ప్రకారం ఇ– క్రాప్‌ పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లదే. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ను స్వయంగా ఎంఏవో, ఎమ్మార్వోలు పరిశీలించాలి. కనీసం 6 శాతం ఆర్డీఏలు, ఏవీఏలు పరిశీలించాలి. కనీసం 5 శాతం ఇ–క్రాప్‌లను డీవోలు, 2 శాతం ఇ–క్రాప్‌లను జేసీలు, ఒక్క శాతం కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి.

17.05 కోట్ల పని దినాలు
ఉపాధిహామీ కింద ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించడం అభినందనీయం. ఇప్పటివరకూ సగటు వేతనం రూ.210.02 ఉండగా కనీసం రూ.240 చొప్పున అందేలా కృషి చేయాలి. కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల ఉపాధిహామీ బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే వెంటనే విడుదల చేస్తాం. సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.

డిజిటల్‌ లైబ్రరీలపై ప్రత్యేక శ్రద్ధ 
డిసెంబర్‌లోగా 4,500 గ్రామ సచివాలయాలకు కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం కలుగుతుంది. అక్కడ డిజిటల్‌ లైబ్రరీలను పూర్తి చేయాలి. మిగిలిన చోట్ల కూడా డిజిటల్‌ లైబ్రరీలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. పులివెందుల నియోజకవర్గం వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటైన డిజిటల్‌ లైబ్రరీని వినియోగించుకుంటూ గ్రామానికి చెందిన 30 మంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. 

ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
గృహ నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్ధ పుంజుకుంటుంది. ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహ నిర్మాణం బాగుంది. సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖలో 1.24 లక్షల ఇళ్లను కేటాయించాం. అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి. కనీస సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్‌ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్‌) ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి.

ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చూడాలి. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగాలి. ఆప్షన్‌ 3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి.  10 వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్‌ కన్వర్షన్‌ వేగంగా జరగాలి. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి.

డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం 
డిసెంబర్‌ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా అడుగులు ముందుకేయండి. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్‌ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి.

మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్‌లో ఫేజ్‌ 3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించాలి. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిట్‌ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలి. డిసెంబర్‌ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఇవ్వబోతున్నాం. ఈమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలి. 

ఎస్‌వోపీల ప్రకారం సర్వే  
జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటివరకూ 5,738 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తైంది. 2,662 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదలయ్యాయి. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ ప్రకారం సర్వే ప్రక్రియ సాగాలి. 

స్పందన ఆర్జీల్లో సమయ పాలన, నాణ్యత 
స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత కనిపిస్తోంది. దీనికి దోహదపడ్డ అధికారులకు అభినందనలు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని పెండింగ్‌ కేసులు, తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారంలో నాణ్యత ఉందనేందుకు ఇది నిదర్శనం. కలెక్టర్లు అందరికీ అభినందనలు. అర్జీ పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారులకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలి.

ఈ కొత్త ఫీచర్‌ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమైంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. దరఖాస్తుదారుడితో లొకేషన్‌లో సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేయాలి. ఈ ఫీచర్‌ కూడా సెప్టెంబరు 26 నుంచి మొదలైంది. ఇది కూడా తప్పనిసరిగా పాటించాలి. 

సచివాలయాల్లో రోజూ సాయంత్రం స్పందన
ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన నిర్వహించాలి. కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకూ తప్పనిసరిగా స్పందనలో పాల్గొనాలి. స్పందనలో పాల్గొన్న అధికారులు కలెక్టర్లు నిర్వహించే సమీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి.

తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాలి. అలా జరిగితేనే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉన్నట్లు. తిరిగి అదే సమస్యపై అర్జీ వస్తే పై అధికారి లేదా మరో అధికారితో విచారణ చేయించండి.

ఎస్‌డీజీ లక్ష్యాలపై కలెక్టర్ల పర్యవేక్షణ 
ఎస్‌డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. డేటాను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలి. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయి. ఎస్‌డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తాం. పనితీరు, సమర్థత ఎస్‌డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తాం. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనను మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుంది.

ఏసీబీ, ఎస్‌ఈబీ నంబర్లతో పోస్టర్లు
దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్‌ కాల్స్‌ చేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్‌ 14400 పోస్టర్‌ అందరికీ కనిపించేలా 3  గీ 5 సైజులో ఉండాలి. ఈ పోస్టర్‌ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయాలి. ప్రతి యూనివర్శిటీ, కాలేజీలో కూడా ఎస్‌ఈబీ నంబర్‌ 14500 ఉండాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

భూసేకరణపై దృష్టి పెట్టాలి
జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. బెంగళూరు– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉంది. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలి. జాతీయ రహదారులకు సంబంధించి 2,758 కి.మీ పరిధిలో రూ.33,507 కోట్లతో చేపడుతున్న 95 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.

మరో 2,687 కిలోమీటర్ల పరిధిలో రూ.55,890 కోట్లతో చేపడుతున్న మరో 63 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు పైగా విలువైన పనులు చేపడుతున్నాం. వీటికి భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి.

సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీస్‌ అజయ్‌ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హరికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వేగంగా మంజూరు.. ప్రారంభం 
ఒక సచివాలయంలో రెండు రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరు చేయాలి. వాటిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మంజూరైన నెల రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలి.  నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయంలో రెండు రోజులపాటు రోజుకు 6 గంటలపాటు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించకుంటే పనులు మంజూరు కావు. ఇప్పటివరకూ గడప గడపకూ నిర్వహించిన సచివాలయాల్లో ప్రాధాన్యతగా గుర్తించి పెండింగ్‌లో ఉన్న పనులను అక్టోబర్‌ 5లోగా మంజూరుచేయాలి. అవి అక్టోబర్‌ చివరి నాటినుంచి ప్రారంభం కావాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top