
సాక్షి, అమరావతి: అమరావతిలోని పేదల ఇళ్ల స్థలాల లేఔట్లలో పచ్చదనాన్ని పెంపొందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటారు. సోమవారం కృష్ణాయపాలెం లేఔట్లో మొక్కలు నాటి నగర వన మహోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత ఈ లేఔట్లో నిర్మించిన మోడల్ హౌస్ను పరిశీలించారు. ఆ ఇంటి యజమానురాలు ఈపూరి జీవరత్నం, ఆమె భర్త, పిల్లలతో మాట్లాడారు. వారి కోరిక మేరకు ఫొటో కూడా దిగారు.
కృష్ణాయపాలెంలో మొక్కలకు నీళ్లు పోస్తున్న సీఎం జగన్
కాగా, మొత్తం 25 లేఔట్లలో పచ్చదనం అభివృద్ధి కోసం కేటాయించిన 10 శాతం భూమిలో అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమంలో భాగంగా రూ.1.68 కోట్లతో 28 వేల మొక్కలు నాటనున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. రావి, వేప, నేరేడు, బాదం, రెయిన్ట్రీ, పచ్చతురాయి, పొగడ, ఆకాశమల్లె వంటి నీడను, పళ్లను ఇచ్చే మొక్కలతో కృష్ణాయపాలెం లేఔట్ హరిత వనంగా మారుతుందన్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు ఆహ్లాదభరిత వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.