సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచిస్తాం: సీఎం జగన్‌

CM Jagan Says Our Government Committed To The Welfare Of Poor - Sakshi

5.65 కోట్ల మందికి రూ.77,731 కోట్ల సంక్షేమ ఫలాలు 

గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగటున ఏటా ఖర్చు చేసింది రూ.15,961 కోట్లు మాత్రమే   

మన ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం ఏటా రూ.39,153 కోట్లు ఖర్చు 

టీడీపీకి ఎన్నికలు, రాజకీయాలు తప్ప పేద ప్రజలు గురించి ఆలోంచే మనసు లేదు

బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు రాకుండా బాబు కేసులు వేయించి అడ్డుకున్నారు

ఇవాళ దళారులు, లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకే డబ్బు జమ  

గర్భవతులు, బాలింతల పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,100 చొప్పు ఖర్చు  

36 నుంచి 72 నెలల పిల్లలకు నెలకు కనిష్టంగా రూ.553 చొప్పున వ్యయం 

గత ప్రభుత్వం బకాయి పడిన రూ.3,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు 

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీలేని రుణం కింద 2019-20లో రూ.1,400 కోట్లు 

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం.. మద్య నియంత్రణతో అక్కచెల్లెమ్మల్లో సంతోషం

పాలన అనేది దేవుడు ఇచ్చిన అవకాశం. పేదలకు మంచి చేయడానికి ఆ అవకాశం ఇచ్చాడు. ఆ మేరకు ఇప్పటికే ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వాటిని ఇంకా ఏవిధంగా మెరుగు పరచాలని రోజూ ఆలోచిస్తుంటాను. 
-ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: తమది పేద, బడుగు ప్రజల సంక్షేమం కోసం 24 గంటలు ఆలోచించే మనసున్న ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వలే ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే వారికి ఆపన్న హస్తం అందించడం ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై గురువారం శాసనసభలో సుదీర్ఘంగా జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏటా ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే అధికంగా వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా గత 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని కులాల పేద ప్రజలకు వివిధ పథకాల కింద 5.65 కోట్ల మందికి రూ.77,731.32 కోట్ల విలువైన ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏటా సగటున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.15,962 కోట్లు వ్యయం చేస్తే తమ ప్రభుత్వం రెట్టింపు కంటే ఎక్కువగా రూ.39,153 కోట్లు వ్యయం చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా, ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు అంటూ హాడావుడి చేయడం ఆయనకు పేద ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియ జేస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రాజకీయాలపైనే బాబు దృష్టి
- అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలన్న ఆలోచన లేకుండా కేవలం రాజకీయాలపైనే చంద్రబాబు దృష్టి సారించారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ చేపట్టినప్పుడు కూడా సూచనలు, సలహాలు ఇవ్వకుండా అబద్ధాలు మాట్లాడుతూ సభను అడ్డుకోవడం ద్వారా సస్పెండ్‌ అవ్వడం వరకు వెళుతున్నారు.  
- ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీల అభ్యున్నతి, బాగు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. వీటిని ఏ విధంగా ఇంకా మెరుగు పరచాలని ఆలోచిస్తున్నాం. ఈ దిశగా ప్రతిపక్షం నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ కూడా ప్రతిపక్షం తీరు మారలేదు. 

చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో - ఇప్పుడు మన పాలనలో..
- బీసీలకు 5 ఏళ్లలో మొత్తం రూ.30,976 కోట్లు, ఎస్సీలకు రూ.33,629 కోట్లు, ఎస్టీలకు రూ.12,488 కోట్లు, మైనారిటీలకు రూ.2,713 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లకు కలిపి రూ.79,807 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏటా సగటున రూ.15,961 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
- దేవుడి దయ, ప్రజల దీవెనల వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18 నెలల్లోనే బీసీల కోసం రూ.37,931 కోట్లు, ఎస్సీల సంక్షేమం కోసం రూ.13,251 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.3,879 కోట్లు, మైనారిటీల సంక్షేమంపై రూ.3,668 కోట్లు ఖర్చు చేశాం. 
- మొత్తంగా ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.58,729 కోట్లు ఖర్చు చేశాం. ఆ మేరకు ఏటా సగటున ఎంత మొత్తం వ్యయం చేశామని చూస్తే అక్షరాలా రూ.39,153 కోట్లు. చంద్రబాబు హయాంతో పోలిస్తే రెట్టింపునకు పైగా ఖర్చు చేశాం. 
- చంద్రబాబునాయుడుకు ఏనాడూ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కలగదు. ప్రజల మనసులో చిరస్థాయిలో నిలవాలి.. వారి ఇళ్లలో మన ఫొటో ఉండాలన్న తపన, తాపత్రయం మనది. చంద్రబాబుకు 
ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పేదవారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు గుర్తుకు వస్తారు. 
- అందుకే ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో బీసీ సబ్‌ ప్లాన్‌ తెచ్చాడు. అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకొచ్చారు. అప్పుడే 13 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పెన్షన్లు కూడా అంతే.  
- ఎన్నికలకు 6 నెలల ముందు వరకు, అంటే అక్టోబరు 2018 వరకు పెన్షన్లు కేవలం 44 లక్షలు ఉంటే, ఎన్నికలు వచ్చే సరికి ఆ సంఖ్యను 51 లక్షలకు పెంచారు. అంటే ఏడు లక్షల మందికి పెన్షన్‌ లేదని తెలిసినా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం 61.90 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తోంది.  

రిజర్వేషన్లు రాకుండా చంద్రబాబు కుట్ర 
- గతంలో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నిలు జరిగాయి. అందులో 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యాయి. టీడీపీ అధికారంలో ఉండగా, ఎన్నికలు అప్పటికే ఆలస్యం అయ్యాయి కాబట్టి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్‌ 23న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
- అయినా చంద్రబాబు గెలుపుపై నమ్మకం లేక ఎన్నికలు జరపలేదు. ఆ రోజు ఆయన ఎన్నికలు నిర్వహించి ఉంటే, ఆ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరిగేవి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవి. కానీ తనకు అనుకూలంగా లేదని ఎన్నికలు జరపలేదు.
- మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిజర్వేషన్‌తో ఎన్నికలు జరపాలని అని చెప్పి 2019 డిసెంబర్‌ 28న జీఓ 176 జారీ చేసి ఎన్నికలకు ముందుకు వెళ్లాం. అయితే అప్పుడు చంద్రబాబు కుట్ర చేసి, ఆయన పార్టీకి చెందిన ప్రతాప్‌రెడ్డితో (చంద్రబాబు, లోకేష్‌తో కలిసి ఉన్న ఫొటోలు చూపారు) కేసు వేయించాడు.
- రిజర్వేషన్లు 50 శాతమే ఉండాలి కదా? 59.85 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారని కేసు వేశారు. వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారికి ఉన్న కెపాసిటీ మనకు లేదు. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వచ్చింది.

దేనిలోనూ చిత్తశుద్ధి లేదు 
- చంద్రబాబు ఏది చేసినా రాజకీయమే. చంద్రబాబు పెట్టిన బకాయిలు చూస్తే.. ఆయనకు ఎక్కడా చిత్తశుద్ధి అనేది, మంచి చేయాలన్న తపన అనేది లేదన్న విషయం తెలుస్తోంది. పేదలు పేదరికం నుంచి బయటకు రావాలంటే పథకాలు పక్కాగా అమలు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అరకొరగా ఇచ్చాడు.
- ఆ పెద్దమనిషి ఆర్‌టీఎఫ్‌ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 2017 - 18 నుంచి రూ.2,134 కోట్లు బకాయిలు పెట్టాడు. ఆ తర్వాత మెస్‌ బిల్లులకు సంబంధించి ఎంటీఎఫ్‌ కింద కూడా మరో రూ.790 కోట్లు బకాయి పెట్టాడు. అంటే దాదాపు రూ.3 వేల కోట్లు చంద్రబాబు ఫీజుల బకాయిలు పెడితే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చెల్లించింది. పెండింగు లేకుండా తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం.
- అలా తల్లుల ఖాతాల్లో వేయడం ద్వారా వారు కాలేజీలో మౌలిక వసతుల గురించి యాజమాన్యాలను ప్రశ్నిస్తారు. దానివల్ల కాలేజీలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తాయి. ఆ తర్వాత ప్రతి త్రైమాసిక ఫీజు కూడా తల్లుల ఖాతాలోనే వేసే వ్యవస్థను తీసుకువచ్చాం.

వడ్డీలేని రుణాలు ఎత్తేశారు
- చంద్రబాబు పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లకు పైగా మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఆగస్టు 2016 నుంచి పూర్తిగా ఆపడంతో వారిపై రూ.3,036 కోట్ల భారం పడింది. ఆ విధంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ మొత్తం అక్క చెల్లెమ్మలు కట్టాల్సి వచ్చింది.
- మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నాం. ఈ పథకంలో 2019-20లో అక్షరాలా రూ.1,400 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. ఒక తపన, తాపత్రయం ఉంటే ఏదైనా చూసే ధోరణి మారుతుంది.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ 
- నిజానికి పిల్లల్లో 85 శాతం మెదడు వికాసం ఆరేళ్లలోపే జరుగుతుంది. అలా జరగాలంటే తల్లులు, పిల్లలకు మంచి ఆహారం ఉండాలి. పాఠశాలల్లో కూడా తగిన సదుపాయాలు, మంచి పునాదులు ఉండాలి. అప్పుడే పిల్లలు బాగా ఎదుగుతారు. అది తెలిసినా చంద్రబాబు ఏనాడూ పిల్లలు, తల్లులు, గర్భవతులు, పాలిచ్చే తల్లుల గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అని అమలు చేస్తున్నాం. ఆ పిల్లలు బాగుండాలి. వారి మెదడు వికసించాలి. తల్లులు బాగుండాలన్న తపన. ఆరాటం మాకు ఉంది.

పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం 
- గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్‌రూమ్‌లు, నీళ్లు, ఫర్నీచర్‌ వంటి కనీస అవసరాలు కూడా లేకుండా చేశారు. దీంతో పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. మధ్యాహ్న భోజనం బిల్లులు 8 నెలలు పెండింగ్‌. పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయాలి. ఆ విధంగా ప్రభుత్వంపై భారం తగ్గించుకోవాలన్న ఆలోచన. వారు ప్రైవేటు స్కూళ్లకు పోవాలన్న ఉద్దేశంతో కావాలనే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారు.
- కానీ మన ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం ద్వారా రూ.10 వేల కోట్లకు పైగా వ్యయంతో 45 వేల స్కూళ్లను ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ఆధునీకరిస్తోంది. ప్రతి స్కూలులో బాత్‌రూమ్‌లు, మంచినీళ్లు, ఫర్నీచర్, బ్లాక్‌బోర్డులు, లైట్లు, ఫ్యాన్లు, ప్రహరీ.. చివరకు పిల్లలకు యూనిఫామ్స్, స్కూల్‌ బ్యాగ్, షూస్, పుస్తకాలు అన్నీ ఇస్తున్నాం.
- మధ్యాహ్న భోజన పథకం బాగు చేయాలని, ఆయాలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచి, గ్రీన్‌ ఛానల్‌లో పెట్టి క్రమం తప్పకుండా వేతనాలు ఇస్తున్నాం. పక్కాగా మెనూ అమలు చేస్తూ, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇలా ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం.

అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారునికే.. 
- ప్రవేశపెట్టిన ప్రతి పథకం సంతృప్తి స్థాయిలో ఏ ఒక్క లబ్ధిదారుడు మిస్‌ కాకుండా అర్హులందరికీ చేరాలన్నది మా ప్రభుత్వ ఆలోచన. ఇందుకని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. ఎవరైనా పథకంలో మిస్‌ అయితే, దరఖాస్తు తీసుకుని అర్హత ఉంటే, ఆ తర్వాత నెలలోనే ఇస్తున్నాం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏమేం చేశామని చెబుతూపోతే ఎంతైనా చెప్పవచ్చు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో వారే నలుగురు ఉన్నారు. 60 శాతం మంత్రి పదవులు వారికే ఇచ్చాం. అణగారిన బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 
- ఎస్సీలలో విభేదాలు రాకుండా వేర్వేరుగా మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.  
- రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలు, మండలికి ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు మైనారిటీలు, ఒకరు బీసీ ఉన్నారు. కార్పొరేషన్లు, ఆలయాల చైర్మన్లు, పాలక మండళ్లు, మార్కెట్‌ కమిటీలలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చే విధంగా చట్టాలు చేశాం. గ్రామ సచివాలయాల్లో వారికి 82 శాతం ఉద్యోగాలు దక్కాయి.
- అక్షరాలా 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 2.61 లక్షల వలంటీర్ల ఉద్యోగాలు ఆ విధంగా దాదాపు 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం.

మహిళా పక్షపాత ప్రభుత్వం 
- మహిళలకు సంబంధించి ప్రభుత్వ పథకాల్లో పెద్ద పీట వేశాం. మహిళా పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులో చూపాం. ప్రతి పథకంలో లబ్ధిదారులు అక్క చెల్లెమ్మలే. వైఎస్సార్‌ చేయూత ద్వారా అక్క చెల్లెమ్మలకు ఉపాధి కల్పిస్తూ, ఆదాయం వచ్చేలా, వారి జీవితాలు మార్చేలా రిలయెన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, అల్లానా, హిందుస్తాన్‌ యూనీ లీవర్, అమూల్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఆ విధంగా రీటెయిల్‌ రంగంలో 77 వేల షాపులు ఏర్పాటు చేశాం. 
- 4.69 లక్షల అక్క చెల్లెమ్మలకు పాడి ఆవులు, గేదెలు.. 2.49 లక్షల అక్క చెల్లెమ్మలకు మేకలు, గొర్రెల యూనిట్లు ఇస్తున్నాం. వారు తమ కాళ్ల మీద నిలబడేలా, లక్షాధికారులు అయ్యేలా చర్యలు తీసుకున్నాం.
- 6,82,467 మంది పెన్షనర్లలో వితంతువులు ఉన్నారు. వారికి పెన్షన్‌ ఇస్తున్నాం కాబట్టి, వారికి చేయూత ఇవ్వొద్దని కొందరు చెప్పారు. అయినా వైఎస్సార్‌ చేయూత కింద వారికి ఆర్థిక సహాయం చేస్తున్న మానవతా దృక్పథం ఉన్న ప్రభుత్వం ఇది. 
- చివరకు 31 లక్షల ఇళ్ల స్థలాలు నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం. మహిళల రక్షణ కోసం దిశ చట్టం బిల్లు ఆమోదించి, కేంద్రానికి పంపాము. దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్‌ పనుల్లో అక్క చెల్లెమ్మలకు 50 శాతం ఇస్తూ చట్టం చేశాం.

దశల వారీ మద్య నియంత్రణ 
- దశలవారీ మద్య నియంత్రణ ఒక పాలసీగా అడుగులు వేశాం. ఆ దిశలో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం. అవి రద్దు కాకపోతే, గ్రామాల్లో అక్క చెల్లెమ్మలకు రక్షణ ఉండదని ఆ పని చేశాం. 
- మద్యం షాపులు ప్రైవేట్‌ వారి చేతిలో ఉంటే, బెల్టు షాపులు వస్తాయని చెప్పి, ప్రభుత్వమే స్వయంగా షాపుల నిర్వహణ చేపట్టింది. 33 శాతం మద్యం షాపులు (4382 నుంచి 2934 షాపులకు) తగ్గించాం. దాని వల్ల మద్యం అమ్మకాలు కూడా తగ్గాయి. షాపులు గతంలో రాత్రి 11 గంటలకు మూస్తే, ఇప్పుడు 8 గంటలకే క్లోజ్‌ చేస్తున్నాం.
- మద్యం ధరలు షాక్‌ కొట్టేలా పెట్టాం. వీటన్నింటి వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి. మనం అధికారంలోకి రాకముందు 2018 అక్టోబర్‌లో 32.28 లక్షల కేసులు మద్యం అమ్మితే, మనం అ«ధికారంలోకి వచ్చాక కేవలం 19.57 లక్షల కేసులు మాత్రమే అమ్మాం.
- 2018 అక్టోబర్‌లో 23.86 లక్షల కేసుల బీర్లు అమ్మితే, ఆ తర్వాత 6.55 లక్షల కేసులు మాత్రమే అమ్మాం. 2018 నవంబర్‌లో (మనం అధికారంలోకి రాక ముందు) మద్యం 29.69 లక్షల కేసులు అమ్మితే, మనం అధికారంలోకి వచ్చాక కేవలం 19.43 లక్షల కేసులు అమ్మాం. 2018 నవంబర్‌లో 17.87 లక్షల కేసుల బీరు అమ్మితే, ఆ తర్వాత ఏడాది అదే సమయంలో కేవలం 5.93 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మాం. అయితే మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం తగ్గలేదు. ఎందుకంటే ధరలు పెంచాం కాబట్టి.
- దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి చేయగలిగాం. గ్రామాల్లోకి పోతే అక్క చెల్లెమ్మలు సంతోషంగా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి కార్యక్రమంలో మంచి చేయాలని ఆరాట పడ్డాం. అలాగే చేస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top