ఏపీ వ్యవసాయశాఖకు మరో అవార్డు.. అభినందించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: Agriculture Leadership Conclave Award: ఏపీ వ్యవసాయ శాఖ మరో అవార్డు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రఖ్యాత అగ్రికల్చర్ టుడే గ్రూప్ ఢిల్లీలో నిర్వహించిన 13 వ అగ్రికల్చర్ లీడర్షిప్ కాన్క్లేవ్ 2022లో పాలసీ లీడర్షిప్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డు దక్కించుకుంది.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్. శేఖర్ బాబు గెడ్డం బుధవారం కలిశారు. సీఎం జగన్ నేతృత్వంలో గడిచిన మూడున్నరేళ్లుగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో అత్యుత్తమ పాలసీ విధానాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఏపీ ప్రభుత్వం కైవసం చేసుకుంది.