YS Jagan: కొరత లేకుండా టీచర్లు

CM Jagan comments in high-level review on new education policy - Sakshi

విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు

నూతన విద్యా విధానంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నైపుణ్యమున్న ఉపాధ్యాయులు చిన్ననాటి నుంచే విద్యార్థులకు అందుబాటులో      

సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలో కూడా వర్గీకరణ 

ఇంగ్లిష్‌ మీడియంలో బోధన.. విద్యార్థుల్లో పోటీతత్వం  

అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌  

తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాల్సిందే 

కొత్త విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాలి 

16న విద్యాకానుక ప్రారంభం  

వర్గీకరణతో 44 వేల నుంచి సుమారు 58 వేలకు పెరగనున్న స్కూళ్లు   

అమ్మ ఒడితో విద్యార్థుల చేరికల్లో పెరుగుదల 

► 1, 2 తరగతులకు విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు పిల్లల సంఖ్యను బట్టి ఒకరు, లేదా ఇద్దరు టీచర్లు ఉంటారు. 
► 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీచర్లు ఉంటారు. నూతన విద్యా విధానం వల్ల ఒక్క స్కూలు కూడా మూత పడదు. ఒక్క టీచర్‌ను కూడా తొలగించడం జరగదు. 

సాక్షి, అమరావతి: నూతన విద్యా విధానంలో స్కూళ్ల వర్గీకరణకు, విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అందడం ద్వారా ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారవుతారని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారు చేసిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం ద్వారా చిన్న నాటి నుంచే విద్యార్థులకు నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తూనే.. 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్ల ద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయని చెప్పారు. 

ఉపాధ్యాయులపై తగ్గనున్న పని భారం 
నూతన విద్యా విధానం ద్వారా ఉపాధ్యాయులపై పని భారం కూడా తగ్గుతుందని, అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందని సీఎం తెలిపారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం, నాడు –నేడు కోసం మొత్తంగా సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. నూతన విద్యా విధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాని, దీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అందరిలోనూ అవగాహన తీసుకురావాలని స్పష్టం చేశారు. ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాన్నారు. ఈనెల 16న విద్యాకానుక ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమీక్షలో ఇంకా చర్చకు వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.  

నూతన విద్యా విధానంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి సురేష్‌ తదితరులు 
  
ఆరు రకాలుగా స్కూళ్ల వర్గీకరణ  
► శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2) 
► ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2) 
► ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు) 
► ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు) 
► హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు) 
► హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) 
  పీపీ–1 నుంచి 12వ తరగతి వరకు వర్గీకరణ వల్ల ప్రస్తుతం ఉన్న స్కూళ్లు 44 వేల నుంచి సుమారు 58 వేలు అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. 
 
విప్లవాత్మక మార్పులు 
► అమ్మ ఒడి, ఇంగ్లిష్‌ మీడియం, నాడు–నేడు తదితర విప్లవాత్మక మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయి. 2014–15 నాటికి రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ 72.33 లక్షలు కాగా, 2018–19 నాటికి 70.43 లక్షలకు పడిపోయింది. అమ్మ ఒడి పథకం వల్ల 2020–21 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 73.06 లక్షలకు చేరుకుంది. అమ్మ ఒడి కారణంగా 2.63 లక్షల మంది పిల్లలు అధికంగా చేరారు.  

► ప్రభుత్వ పాఠశాలల్లో 2014–15 నాటికి ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య 42.83 లక్షలు. 2018–19 నాటికి ఆ సంఖ్య 37.21 లక్షలకు పడిపోయింది. 2020–21 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌ అయిన విద్యార్థుల సంఖ్య మళ్లీ 43.44 లక్షలకు చేరింది. 

► ప్రభుత్వ విద్యారంగంపై నమ్మకం పెరిగింది. అమ్మ ఒడి ద్వారా పిల్లలను బడికి పంపాలన్న కోరిక బలపడిందని, ఈ పథకం ద్వారా స్కూల్లో చదువుకుంటున్న పిల్లల వివరాలు పక్కాగా ఉన్నాయని  అధికారులు తెలిపారు. సామాజిక తనిఖీల ద్వారా (సోషల్‌ ఆడిట్‌) కచ్చితమైన డేటా రూపొందిందన్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రాల్లోనూ విద్యార్థుల వివరాలు ఇంత పక్కాగా లేవని వివరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top