నిర్వహణ నిధుల కోసం యూజర్ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: విద్యుత్తు వాడకానికి స్మార్ట్ మీటర్లను అనుమతించేది లేదని ఎన్నికల ముందు గంభీరంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తాగునీటికి సైతం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. గ్రామీణ ప్రాంత తాగునీటి వ్యవస్థలోనూ నీటి పరిమాణాన్ని నిర్ధారించే మీటర్ల ఏర్పాటుతో పాటు మంచినీటి పథకాల నిర్వహణకు నిధుల సమకూర్చుకునేందుకు యూజర్ చార్జీల వసూలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది. ఈ జీవోలో ప్రభుత్వ నిర్ణయాలు, వాటి అమల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, అధికారుల బాధ్యతలను నిరా్ధరించారు.
గ్రామాల్లో ఇళ్లకు తాగునీరు సరఫరా చేసే ప్రతి డెలివరీ పైపుపై తప్పనిసరిగా కాలిబ్రేటెడ్ ఫ్లో (సరఫరా చేసే నీటి పరిమాణం కొలిచే) మీటర్లను ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ మీటర్ల ద్వారా ఎంత పరిమాణంలో నీటిని వినియోగించారన్నది కూడా ఖచ్చితంగా కొలవాలని మరోచోట నిర్దేశించారు.
ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఆధ్వర్యంలో నీటి పరిమాణ నిర్ధారణ మీటర్లను ఏర్పాటు చేయాలని.. పంపు ఆపరేటర్లు ప్రతి నెలా 1, 15వతేదీలలో ఆయా మీటర్లలో వివరాలు నమోదు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి బోర్ల చుట్టూ 15 మీటర్ల పరిధిని ‘నో–యాక్టివిటీ జోన్’గా ప్రకటించి బట్టలు ఉతకడం, స్నానాలు చేయడం, చెత్త వేయడం పూర్తిగా నిషేధించాలని సూచించారు. బోర్లకు 50 మీటర్ల పరిధిలో సెప్టిక్ ట్యాంకులు లేదా మురుగునీటి గుంతలు ఉండకుండా చూడాలని పేర్కొన్నారు.


