'ప్రైవేటే షైనింగ్‌' స్టార్‌ | Awards to 4168 students across the state | Sakshi
Sakshi News home page

'ప్రైవేటే షైనింగ్‌' స్టార్‌

Jun 10 2025 4:26 AM | Updated on Jun 10 2025 4:26 AM

Awards to 4168 students across the state

రాష్ట్రవ్యాప్తంగా 4,168 మంది విద్యార్థులకు పురస్కారాలు 

వీరిలో 3 వేలమంది పైగా ప్రైవేటు విద్యార్థులే...! 

ప్రతిభ గల ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు దక్కని గుర్తింపు 

ప్రభుత్వ విద్యారంగం తిరోగమనానికి ఇదే నిదర్శనమంటున్న విశ్లేషకులు 

గత ప్రభుత్వంలో జగనన్న ఆణిముత్యాలు పూర్తిగా ప్రభుత్వ విద్యార్థులకే

విజయనగరం జిల్లా నుంచి షైనింగ్‌ స్టార్‌ అవార్డులకు 40 మంది జూనియర్‌ కాలేజీ విద్యార్థులను ఎంపిక చేయగా, వీరిలో 29 మంది ప్రైవేటు కాలేజీవారు.  11 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల వారు.  

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఇదే విధంగా అవార్డులకు ఎంపిక జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఏడాదికాలంలో ప్రభుత్వ విద్యను ఎంతగా దిగజార్చారో ఇదిఉదాహరణ మాత్రమే.   

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్య అభాసుపాలవుతోంది. ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు దక్కాల్సిన గుర్తింపు ప్రైవేటు సంస్థలకు చెందుతోంది. తాజాగా ఇచ్చిన ‘షైనింగ్‌ స్టార్‌’ పురస్కారాలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 4,168 పురస్కారాల్లో 3 వేలకు పైగా ఆ సంస్థల విద్యార్థులకే కట్టబెట్టారు. ప్రతి మండలంలో పదో తరగతిలో ఆరుగురు, ఇంటర్మీడియట్‌లో జిల్లాకు 36 మంది చొప్పున అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.

అయితే, గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు జూనియర్‌ కాలేజీ విద్యార్థులకే దక్కడంతో షైనింగ్‌ స్టార్‌లుగానూ వారే అధికంగా ఎంపికయ్యారు. అత్యంత గందరగోళంగా జరిగిన స్పాట్‌ వాల్యూయేషన్‌ ప్రక్రియతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 

ప్రైవేటుకు మేలు జరిగేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించలేదు. పైగా, ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకే షైనింగ్‌ స్టార్‌ అవార్డులు ఇచ్చింది. రూ.20 వేల నగదు, మె­డల్‌తో పాటు అభినందన పత్రం బహూకరించారు.  

సోమవారం 26 జిల్లా కేంద్రాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో 600కి 500 పైన (సగటున 83.33 శాతం) మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులను మండలానికి ఆరుగురు చొప్పున, 70 శాతం మార్కులు సాధించిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను జిల్లాకు ముగ్గు­రు చొప్పున ఎంపికచేసి అవార్డులను ఇచ్చారు. ఇంట­ర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ, ఒకేషనల్‌ గ్రూపుల్లో 830పైగా మా­ర్కులు పొందిన 36 మందిని, 700 మార్కులు పొందిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను సత్కరించారు.   

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకే గుర్తింపు 
నాడు జగనన్న ఆణిముత్యాలు అధికం ప్రభుత్వ విద్యార్థులకే 
రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువులో రాణిస్తే పేదరికం పోగొట్టవచ్చని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కాంక్షించారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదివితే అద్భుతంగా రాణిస్తారని బలంగా నమ్మారు. దీనికోసం వైఎస్‌ జగన్‌ హయాంలో మనబడి నాడు–నేడు పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి అంతర్జాతీయ స్థాయి బోధనను అందించారు. వైఎస్‌ జగన్‌ తెచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీల వారిని తలదన్నేలా అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 

‘జగనన్న ఆణిముత్యాలు’ కింద ఎంపికయ్యారు. కానీ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌పై కక్ష సాధించేందుకు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ‘పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు, ప్రైవేటు బడులు బాగుంటాయి. డబ్బున్నవారు అక్కడ చదువుకుంటారు, మేధావులుగా తయారవుతారు. 

మీరూ ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్లకు వెళ్లండి’ అని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. దీనికితగ్గట్లే 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రహసనంగా మార్చేశారు. వేలాదిమంది ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement