అన్నమయ్య జిల్లా కేంద్రంలో దారుణం
ఇంకా ఇద్దర్ని చంపేస్తానంటూ బావమరిదికి ఫోన్లో బెదిరింపులు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె మండలం కోళ్లబైలు–1 బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నేర చరిత్ర ఉండి, పదేళ్ల జైలుశిక్ష తర్వాత ఇటీవలే విడుదలైన తంబళ్లపల్లె మండలం దిగువపల్లికి చెందిన కె.మధుకర్రెడ్డి, తనతో కాపురానికి రావడానికి నిరాకరించిందన్న కసితో భార్య దండామణి(38)ని మచ్చు కత్తితో కిరాతకంగా నరికి చంపేశాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 19 ఏళ్ల కిందట స్వగ్రామంలో బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులున్నాయి.
జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలని భార్యను వేధిస్తూ.. ఇటీవల బావమరిదిపై దాడి చేశాడు. కాగా, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అనంతరం బావమరిదికి ఫోన్ చేసి.. ‘ఇంకా ఇద్దరున్నారు.. వారిని కూడా చంపి నేనూ చచ్చిపోతా’ అంటూ హెచ్చరించాడు. బాధితుడు ఈ ఆడియో రికార్డింగ్ను డీఎస్పీ బుచ్చిరాజుకు వినిపించడంతో ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


