సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆరుగురు మృతుల్లో ఐదుగురిని పోలీసులు గుర్తించారు. వెలుగుబంటి సత్యసనారాయణ(55) యజమాని, పాకా అరుణ (30), చిట్టూరి శ్యామల, కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నంగా గుర్తించారు.


బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు తీవ్రతకు బాణసంచా తయారీ కేంద్రానికి 50 మీటర్ల దూరంలో ఉన్న రిటైల్ కేంద్రం కూడా దగ్ధమైంది. పేలుడు తీవ్రతకు షెడ్డు కుప్పకూలింది. సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ,ఎస్పి రాహుల్ మీనా పరిశీలించారు. జిల్లాలో 35 బాణాసంచా తయారీ కేంద్రాలకు అనుమతులు ఇచ్చామని.. బాణాసంచి కేంద్రాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.


