
సాక్షి, తూర్పు గోదావరి: జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది బాణాసంచా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బాణాసంచా తయారీ కేంద్రం నుంచి మంటలు ఎగసి పడుతుండగా.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటన సమయంలో పది మంది దాకా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.
