
రూ.1,64,875 కోట్ల పెట్టుబడులతో మొదటి స్థానంలో మహారాష్ట్ర
రూ.56.030 కోట్లతో రెండోస్థానంలో కర్ణాటక
రూ.4.21 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 50 శాతంపైగా ఈ రెండు రాష్ట్రాలకే
డీపీఐఐటీ తాజా గణాంకాల్లో వెల్లడి
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,957.04 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డైకిన్, పానాసోనిక్ ,ఏటీసీ టైర్స్ వంటి సంస్థల నుంచి ఈపెట్టుబడులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.4,21,929 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
అందుకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం విదేశీట్ట్టుబడుల్లో 50 శాతానికి పైగా పెట్టుబడులు మహారాష్ట్ర, కర్ణాటకకే రావడం గమనార్హం. మొత్తం పెట్టుబడుల్లో 39.07 శాతం వాటా రూ.1,64,875 కోట్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. 13.27 శాతం వాటా రూ.56,030 కోట్లతో కర్నాటక రెండవస్థానం సాధించింది.
అత్యధికంగా మారిషస్, సింగపూర్ నుంచే..
మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా 49 శాతం మారిషస్, సింగపూర్ దేశాల నుంచే వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్ మొదటిస్థానంలో ఉంటే అదే రూపాయల పరంగా చూస్తే సింగపూర్ మొదటిస్థానంలో ఉంది.
ఏప్రిల్–2000 నుంచి ఇప్పటివరకు మారిషస్ నుంచి రూ.10,92,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం వచ్చిన పెట్టుబడుల విలువలో ఇది 25 శాతం. ఇదే సమయంలో 24 శాతం వాటాతో సింగపూర్ నుంచి రూ.12,18,108 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. సర్వీసు, కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ రంగాల్లోకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
2024–25లో ఎఫ్డీఐ ఆకర్షించిన టాప్–5 రాష్ట్రాలు ఇవే..
మహారాష్ట్ర 1,64,875
కర్నాటక 56,030
గుజరాత్ 51,540
ఢిల్లీ 47,947
తమిళనాడు 31,103