ఇక గర్భిణులకు నిశ్చింత | AP: Free TIFA under Arogyashri scheme | Sakshi
Sakshi News home page

ఇక గర్భిణులకు నిశ్చింత

Oct 10 2023 6:19 AM | Updated on Oct 10 2023 12:47 PM

AP: Free TIFA under Arogyashri scheme - Sakshi

సాక్షి, అమరావతి: నవ మాసాలు మోసి కన్న బిడ్డకు గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, నయంకాని వ్యాధులుంటే ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. ఇలా ఏ తల్లి క్షోభకు గురికాకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్‌ సేవలను ఉచితంగా సీఎం జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించేందుకు టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌(టిఫా) స్కాన్‌ దోహదపడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ఉచితంగా చేస్తోంది. ఈ ఏడాది మే నుంచి ఆరోగ్యశ్రీ కింద గర్భిణులకు ఒక టిఫా, రెండు అ్రల్టాసౌండ్‌ స్కాన్‌లు/మూడు అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది.

మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్‌ అబ్‌్రస్టెటిక్‌ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు­(మెంటల్‌ డిజబిలిటీ), సింగిల్‌ జీన్‌ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన వారికి, ఇతర సమస్యలున్న గర్భిణులకు వైద్యుడి సూచన మేరకు టిఫా స్కాన్‌ చేస్తున్నారు. పైసమస్యలేవీ లేని గర్భిణులకు మూడు అ్రల్టాసోనోగ్రామ్‌ స్కాన్‌లు చేస్తున్నారు.

ఇలా ఇప్పటి వరకూ 1500 మందికి పైగా గర్భిణులు ఉచిత టిఫా, అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సేవలు పొందారు. టిఫా స్కానింగ్‌కు ప్రైవేట్‌గా అయితే రూ.1,500 నుంచి రూ.2,500 వరకూ ఖర్చవుతుంది. గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లే వ­రకూ మహిళలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ప్రసవించిన మహిళలకు విశ్రాంత సమయానికి భృతిగా రూ.5 వేల చొప్పున వైఎస్సార్‌ ఆసరా సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇక 108 అంబులెన్స్‌ల ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు తరలించడం, ప్రసవానంతరం వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా వారిని ఇంటికి చేరుస్తుండటం తెలిసిందే.     

ముందే గుర్తిస్తే నయమయ్యే అవకాశం  
మేనరికం వివాహాలు, జన్యు సంబంధిత లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం వంటి వివిధ కారణాలతో శిశువుల్లో లోపాలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలను ముందే గుర్తిస్తే అత్యధిక శాతం నయం చేయడానికి వీలుంటుంది. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశముంటుంది.  
– డాక్టర్‌ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య, ఆరోగ్య శాఖ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement