AP: మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరం: సీఎం వైఎస్‌ జగన్‌

AP Assembly Budget Session 2022: Day 2 Updates - Sakshi

Updates:

► ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి.

► గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి​ చేశారని తెలిపారు.

► గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

► గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు. గౌతమ్‌రెడ్డి మృతి తనకు, పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు.

► గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి గొప్ప విద్యావంతుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆత్మీయుడని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నెల్లూరు జిల్లా పర్యటనపై గౌతమ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారని గుర్తుచేశారు. 

గౌతమ్‌రెడ్డి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి: ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావు
► గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ధర్మన ప్రసాదరావు మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి రాజకీయల్లో​ ఉన్నతమైన పదవులు సాధించినా ఎప్పుడూ గొప్ప సంస్కారంతో ఉండేవారని  తెలిపారు. గౌతమ్‌రెడ్డి మరో మూడు దశాబ్దాలు ప్రజా జీవితానికి పనికివస్తాడని తాను భావించేవాడినని గుర్తుచేసుకున్నారు.

► గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఏపీ ఐటీ పాలసీలు చేస్తున్నప్పుడు ‘గౌతమ్‌రెడ్డి అన్న’తో అనేకసార్లు చర్చించినట్లు గుర్తు చేసుకున్నారు.

గౌతమ్‌రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటు: ఆదిమూలపు

►నిరంతరం తపన కలిగిన వ్యక్తి గౌతమ్‌రెడ్డి అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ గుర్తుచేశారు. కడప జిల్లాఇన్‌చార్జ్‌గా ఉన్న సమయంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పుడు అక్కడ కూడా గౌతమ్‌రెడ్డి పట్టుదల, కమిట్‌మెంట్‌ చూశామని తెలిపారు.  

► గౌతమ్‌రెడ్డి అకాల మరణం బాధాకరం: ఆనం

► బంగారం లాంటి మనిషిని రాష్ట్రం కోల్పోయింది. మేకపాటి కుటుంబంతో 35 ఏళ్ల అనుబంధం ఉంది: మంత్రి బాలినేని

దురదృష్టకరం: ఆర్కే రోజా

► గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజల మెప్పు మాత్రమే కాదు.. తోటి రాజకీయ నేతల మెప్పుకూడా పొందిన వ్యక్తి. అజాతశత్రువు ఆయన. ప్రతిపక్షాల మెప్పు సైతం పొందిన వ్యక్తి. జగనన్నకి నిజమైన సైనికుడు గౌతమ్‌రెడ్డి.

పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలు గౌతమ్‌ రెడ్డి సంతాప తీర్మానంపై సభలో ప్రసంగించారు. 

► గౌతమ్‌.. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి : పెద్దిరెడ్డి

► ఎన్ని బాధ్యతలు నిర్వహించినా.. వివాదాలు లేకుండా సమర్థవంతుడిగా పేరుంది గౌతమ్‌ రెడ్డికి. ఆయన లేని లోటు తీరనిది: కాకాణి

గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై ప్రసంగించిన మంత్రి అనిల్‌
► వివాదాలు లేని వ్యక్తి మేకపాటి గౌతమ్‌రెడ్డి. ఎలాంటి ఇగో లేని వ్యక్తి. గౌతమ్‌రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆయన మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యాం.. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. 2010 నుంచి సన్నిహితగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి అనిల్‌. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ప్రసంగించాడు మంత్రి అనిల్‌.

► ఏపీ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. గౌతమ్‌రెడ్డి సంతాపం తీర్మానం సభలో ప్రవేశపెట్టిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అదేవిధంగా ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానునుంది.

శాసన మండలిలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానంపై చర్చ అనంతరం శాసన మండలి వాయిదా పడనుంది. ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించాలని శాసన సభ బీఏసీ (బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. 9వ తేదీన గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 10వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, చర్చ జరగనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top