సాక్షి, తిరుపతి: టీటీడీలో మరో కొత్త వివాదం తెరపైకి రాగా, 60 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీలో అక్రమాలపై విచారణ జరగాలని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కోర్టు నిలిపేసిన పోస్టులపై నోటిఫికేషన్ ఎలా ఇస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. లీగల్ సమస్యలపై వస్తాయనే కోర్టు తాతాల్కికంగా నిలిపేసిందన్న భూమన.. టీటీడీ ఛైర్మన్ ఒక్కో పోస్ట్ను రూ.30-40 లక్షలకు అమ్ముకున్నారంటూ ఆరోపించారు.
‘‘రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక కేటాయింపులు జరపకపోవడంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా నోటిఫికేషన్ నిలిపివేశాం. ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిలిపివేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన ఏడాదిన్నర తర్వాత గత మే నెలలో నోటిఫికేషన్ జారీ చేశారు.
..టీటీడీ చైర్మన్, ఆయనకు కొమ్ముకాసే ఇద్దరు సభ్యులు సహకారంతో ఒక్కో పోస్ట్ను 30-40లక్షలకు అమ్ముకున్నారనే చర్చ జరుగుతోంది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. 2024-25 ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. రాష్ట్రం మొత్తం ఒకే జోన్గా పరిగణించారు, రాయలసీమ ప్రాంతం వారికి అన్యాయం జరిగింది. రాయలసీమ ప్రాంత వాసులకు ప్రత్యేక అవకాశం కల్పించాలనే ఆ రోజు నోటిఫికేషన్ రద్దు చేశాం.
..రాష్ట్రం మొత్తం ఒకే జోన్ కిందకు తీసుకు వచ్చారు. ఒక్కో పోస్ట్ లక్షలాది రూపాయలకు పోస్ట్లు అమ్ముకుంటున్నారు. 60 పోస్టుల భర్తీకి మద్రాస్ ఐఐటీ వాళ్లకు బాధ్యత అప్పగించాం. పారదర్శకంగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం.. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నోటిఫికేషన్ నిలిపివేశాము’’ అని భూమన వివరించారు.


