
డాక్టర్ సురేష్, పద్మలీల దంపతులపై చేయి ఎత్తి కొట్టేందుకు యత్నిస్తున్న పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ.దామోదర నాయుడు
వారిపై చెయ్యెత్తిన పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డా. దామోదర్నాయుడు
దరఖాస్తు చేయకుండానే బదిలీచేసి పోస్టింగ్ ఇవ్వలేదని అడిగినందుకు దౌర్జన్యం
నిలదీసిన కొద్దిసేపటికి పోస్టింగ్ ఆర్డర్లు
డైరెక్టర్ తీరుపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు
ఈ శాఖలో బది‘లీలలు’ కోకొల్లలు
ఎనిమిది నెలల గర్భిణీ దరఖాస్తు చేయకపోయినా స్థానచలనం
క్యాన్సర్తో బాధపడుతున్న మరో మహిళా డాక్టర్ కూడా..
వెటర్నరీ అసిస్టెంట్కు వెటర్నరీ డాక్టర్గా పోస్టింగ్
సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి పాలనలో నాయకులు, పోలీసులే కాదు.. పాలకపక్ష నేతల అడుగులకు మడుగులొత్తే కొందరు అధికారులు సైతం పేట్రేగిపోతున్నారు. చేతిలో అధికారం, పెద్దల ఆశీర్వాదం ఉందన్న ధీమాతో కిందిస్థాయి వారిని ఇష్టారాజ్యంగా వేధిస్తున్నారు. పశుసంవర్థక శాఖలో ఓ ఉన్నతాధికారి ఓ అడుగు ముందుకేసి దంపతులపై చెయ్యెత్తి కొట్టేందుకు బరితెగించారు. బదిలీల్లో తాము దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ అయిందని.. పైగా పోస్టింగ్ ఇవ్వలేదని అడగడమే వారు చేసిన నేరం. ఆ వివరాలు..
స్పౌజ్ గ్రౌండ్లో పశు వైద్యులు డాక్టర్ సురేష్ విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురపల్లిలోనూ, డాక్టర్ పద్మలీల గాజువాక డిస్పెన్సరీల్లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. తాజా బదిలీల్లో వారు దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ పద్మలీలను బదిలీచేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. తమ గోడు చెప్పుకునేందుకు విజయవాడ వచ్చిన ఈ దంపతులపై పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి. దామోదరనాయుడు చేయిచేసుకున్నంత పనిచేశారు. ‘నిబంధనల మేరకే బదిలీలు చేశాం.. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే వెళ్లి ప్రభుత్వానికి చెప్పుకోండి.. మీరు కోరుకున్న చోట పోస్టింగ్లు ఇవ్వడం కుదరదు’.. అంటూ గుడ్లురుముతూ ఆగ్రహంతో ఊగిపోయారు. చెయ్యెత్తి కొట్టేందుకు వారి మీదకు దూసుకెళ్లారు.
‘కొట్టాలనుకుంటే కొట్టండి.. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. అప్లై చేయకుండా ఎలా బదిలీ చేస్తారు? కనీసం ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారో కూడా చెప్పకపోతే ఎలా?’.. అంటూ డాక్టర్ సురేష్ దంపతులు వాపోయారు. ‘ముందు మీరిక్కడ నుంచి వెళ్లిపోండి. పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తాం’.. అంటూ బలవంతంగా వారిని అక్కడ నుంచి పంపించేసిన కొద్దిసేపటికే వారిద్దరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాడచీపురపల్లి నుంచి ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడకు సురేష్ను.. ఆయన ఖాళీచేసిన వాడచీపురపల్లికి ఆయన భార్య పద్మలీలను పంపించారు. ఈ ఘటన ఒక్కటే కాదు.. పశుసంవర్థక శాఖలో జరిగిన తాజా బదిలీల్లో ఉన్నతాధికారుల లీలలు కోకొల్లలు. జీఓ–23 ప్రకారం.. ఐదేళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలి.
దరఖాస్తు చేస్తేనే రెండేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలి. కానీ, ఆచరణకు వచ్చేసరికి ఈ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ నేతల సిపార్సు లేఖలు ఉంటే చాలు అడ్డగోలుగా బదిలీలు చేసేశారు. ముడుపులు ముట్టజెప్పిన వారికైతే కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చారు. సిఫార్సులున్నాయనే సాకుతో 5–7 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి జోలికిపోని ఉన్నతాధికారులు, పనిచేసేచోట ఆరునెలల సర్వీస్ కూడా పూర్తికాని వారిని పైరవీలతో బదిలీలు చేశారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారికైతే కోరుకున్న చోట కోరుకున్న పోస్టింగ్లు ఇచ్చారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాధాన్యత గల కీలక విభాగాల్లో తమకు అనుకూలంగా ఉన్న వారికి పోస్టింగ్లు ఇచ్చుకున్నారని డైరెక్టర్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశ్నిస్తే దాడికి యత్నిస్తారా?
బదిలీల్లో నిబంధనలు పాటించలేదు. దరఖాస్తు చేయకపోయినా, ఐదేళ్లు నిండకపోయినా అడ్డగోలుగా బదిలీలు చేశారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే నానా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం, దాడికి సైతం యత్నించడం చేస్తున్నారు. డాక్టర్ సురేష్ దంపతులపట్ల పశుసంవర్థక శాఖ డైరెక్టర్ దామోదరనాయుడు ప్రవర్తించిన తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – డాక్టర్ సీహెచ్ కృష్ణారావు, చైర్మన్, ఏపీ పశుసంవర్థక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ