పరాకాష్టకు రెడ్‌బుక్‌ కుట్ర .. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అక్రమ అరెస్ట్‌ | Andhra Pradesh IPS Officer PSR Anjaneyulu Arrested In Mumbai Actress Kadambari Jethwani Case | Sakshi
Sakshi News home page

పరాకాష్టకు రెడ్‌బుక్‌ కుట్ర .. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అక్రమ అరెస్ట్‌

Apr 23 2025 4:20 AM | Updated on Apr 23 2025 9:25 AM

Andhra Pradesh IPS officer PSR Anjaneyulu arrested

పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును విజయవాడలోని సీఐడీ రీజనల్‌ కార్యాలయానికి తీసుకువెళ్తున్న అధికారులు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అక్రమ అరెస్ట్‌

హనీట్రాప్‌ కేసులో నిందితురాలు కాదంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదు 

ఇద్దరు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ను తప్పుపట్టిన న్యాయస్థానం 

తాను తప్పు చేయలేదని ముందస్తు బెయిల్‌కు వెళ్లని పీఎస్‌ఆర్‌ 

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్రమ అరెస్ట్‌ 

కాదంబరి జత్వానీ ఆరోపణలను తోసిపుచ్చిన పీఎస్‌ఆర్‌ 

హైదరాబాద్‌లో అరెస్ట్‌ సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్‌ అత్యుత్సాహం 

సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలింపు.. మరిన్ని అక్రమ కేసులకు కుట్ర!

సాక్షి, అమరావతి:  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ  అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన్ను సస్పెండ్‌ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలపు వల వేసి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన మోడల్‌ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అక్రమంగా అరెస్టు చేసింది.

మంగళవారం తెల్లవారుజామునే సీఐడీ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్‌ నుంచి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. 

జత్వానీని అడ్డుపెట్టుకుని కుట్ర 
కాదంబరి జత్వానీ విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్‌ గున్నీలపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్‌ చేసింది. వారిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యా సాగర్‌ను అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.

అయితే ఈ కేసులో టి.కాంతిరాణా, విశాల్‌ గున్నీలకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కాగా, ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్‌కు వెళ్లాలన్న పలువురి సూచనను పీఎస్‌ఆర్‌ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ను అరెస్టు చేసింది.  

నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు 
ఈ అక్రమ కేసులో పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను సీఐడీ అధికారులు ఇప్పటి వరకు విచారించనే లేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. విచారణకు పిలవనూ లేదు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడూ తన మొబైల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకోలేదు. అయినాసరే సీఐడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆయన్ను అరెస్ట్‌ చేయడం గమనార్హం. కాగా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.

ఈ కేసుతో కానీ, సీఐడీతో కానీ సంబంధంలేని కోయ ప్రవీణ్‌.. మరికొందరు పోలీసులతో కలిసి పీఎఎస్‌ఆర్‌ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావుడి చేశారు. పీఎస్‌ఆర్‌ ఇంట్లో ఉన్నారా.. లేదా.. ఎక్కడికైనా వెళ్తున్నారా.. అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్టు చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సీఐడీ అధికారులకు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్‌ మాత్రం పీఎస్‌ఆర్‌ నివాసంలోకి వెళ్లి ల్యాప్‌టాప్‌ కావాలి.. ఏవేవో పత్రాలు కావాలి.. డివైజుసులు కావాలంటూ హడావుడి చేశారు.  

ఇరికించే కుట్రతోనే విచారణ 
పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు విచారణ పేరిట సీఐడీ అధికారులు పచ్చ కుట్రను అమలు చేసేందుకే పెద్దపీట వేశారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని దాదాపు 6 గంటలపాటు విచారించారు. హనీట్రాప్‌ నిందితురాలు కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలని అప్పటి విజయవాడ సీపీ కాంతికాణా, డీసీపీ విశాల్‌ గున్నీని ఆదేశించారా.. అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారా.. అని ప్రశి్నంచారు. తనకు ఆ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని.. ఇంటలిజెన్స్‌ అధికారులు కేసుల దర్యాప్తు వ్యవహరాలను పర్యవేక్షించారని పీఎస్‌ఆర్‌ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.

తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వానీని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారని.. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెను రిమాండ్‌కు తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కదాంబరి జత్వానీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు.  

మరిన్ని అక్రమ కేసులకు కుట్ర 
కాగా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. కదాంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్రా అక్రమ కేసులతో ఆయన్ను వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రకు పదును పెడుతున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement