10న పదో తరగతి పరీక్షల ఫలితాలు
పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జూన్ 10న వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నట్టు పాఠశాల విద్య రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. ఆయన సోమవారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి మూల్యాంకన ప్రక్రియను తనిఖీ చేశారు.
అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరం 6,22,537 మంది పరీక్షలు రాసినట్టు తెలిపారు. ఈ నెల 13 నుంచి పేపర్ వాల్యుయేషన్ జరుగుతోందని, ఇప్పటికే దాదాపు 25 శాతం పేపర్ల వాల్యుయేషన్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లా డీఈవోలు క్యాంప్ ఆఫీసర్లుగా మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
అనంతరం విజయవాడలోని రాష్ట్ర పరీక్షల విభాగం కార్యాలయంలో డీ కోడింగ్ ప్రక్రియ నిర్వహించి.. జూన్ 10న ఫలితాల వెల్లడికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 26 జిల్లాలను యూనిట్గా తీసుకుని పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని దేవానందరెడ్డి వివరించారు.