పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి డాక్టర్' వైఎస్సార్'

Ajay Kallam Speech In YSR Death Anniversary At Guntur - Sakshi

ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం

108 ఆరోగ్యయోధులకు ఘనసత్కారం

ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో దివంగత వైఎస్సార్ కు ఘననివాళులు

సాక్షి, గుంటూరు : ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం. ప్రభుత్వాధినేతలు పని చేయాల్సింది ప్రజల కోసం. అధికారంలో ఉండేది ఏ పార్టీ అయినా కావచ్చు. కాని, అంతిమ లక్ష్యం మాత్రం ప్రజా ప్రయోజనమే అయ్యిండాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేవారని ప్రభుత్వ ముఖ్యసలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం స్థానిక హిందూ ఫార్మశీ కళాశాల ఆడిటోరియంలో ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్యక్రమంలో తొలుతగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం ప్రకటించారు. అనంతరం మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన అతిథులతో జ్యోతిప్రజ్వలనగావించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సభకు మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా.. అజేయ కల్లం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దివంగత వైఎస్సార్  సంక్షేమ పాలకుడని, సుపరిపాలనా సేవకుడని కొనియాడారు.

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను అర్థం చేసుకుని, అధినేతగా అధికారాన్ని అందుకోవడానికి ముందు, ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసిన నాయకుడు వైయస్సార్ అని కీర్తించారు. 1997లో ఏపీలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం అప్పులు పెరిగిపోవడమేనని... విద్య, వైద్యం, సాగునీటి సమస్యలేనని తాము అప్పట్లో నివేదిక అందజేసినట్లు గుర్తుచేశారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్ రూపకల్పన దివంగత వైఎస్ఆర్ చేతులమీదుగా జరిగాయని వివరించారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామూల్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. 108 సర్వీసుల ఆరోగ్యయోధులు కోవిడ్ ఆపత్కాలంలో కష్టపడి, తెగువతో పనిచేసి లక్షలాది ప్రాణాలు నిలబెట్టారని అభినందించారు. అరబిందో 108 సర్వీసుల సీఈఓ సాయిస్వరూప్ మాట్లాడుతూ కోవిడ్ ఆపత్కాలంలో 108 అంబులెన్స్ సర్వీసుల ద్వారా 1.42 లక్షల కేసుల బాధితులను, 82వేల మంది సాధారణ రోగులను తరలించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాదిలో 108 ద్వారా నాలుగు వేల కొత్త ఉద్యోగాలు కల్పించారని చెప్పారు.

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... మంచిని మెచ్చుకోలేని ప్రతిపక్షం ఉన్నా లేనట్టేనని... విమర్శల్ని సైతం పాజిటివ్ తీసుకునే వ్యక్తిత్వం డాక్టర్ వైఎస్ఆర్ ది అని చెప్పారు. ఎమ్మెల్యే మద్దాళి గిరి మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ పారిశ్రామిక అభివృద్ధికి బీజాలేశారన్నారు. పేదల స్థితిగతులు తెలిసినందునే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కోసమే ప్రభుత్వం అని ప్రకటించారని గుర్తుచేశారు.

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా మాట్లాడుతూ.. పరిపాలన, ప్రజాసంక్షేమం విషయంలో వైఎస్‌ నిర్ణయాలు దేశానికే మార్గదర్శకాలయ్యాయని  అన్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ రాష్ట్రాన్ని దివంగత వైఎస్‌ నడిపించిన తీరు.. జాతీయస్థాయిలో మనల్ని ఎంతో గర్వించేలా చేసిందని గుర్తుచేశారు. చైతన్య గోదావరిగ్రామీణ బ్యాంకు చైర్మన్ టి.కామేశ్వరరావు మాట్లాడుతూ దివంగత వైఎస్‌ భౌతికంగా దూరమైనా పథకాల రూపంలో బతికే ఉన్నారని తెలిపారు.

కీర్తన ట్రస్టు అధినేత మేరుగ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దివంగత వైఎస్‌ స్ఫూర్తి ఎప్పటికీ విలువల బాటలో నడిపిస్తూనే ఉంటుందన్నారు. మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి హయాంలో జనవిజ్ఞాన తరఫున కోరిన వినతులన్నీ అమలుచేసి పథకాల రూపంలో ప్రజలకు మేలు చేశారని.. పలు ఆశక్తికర ఘటనలను ప్రస్తావించి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఉత్తమ సేవలందించిన 28మంది 108 సేవల ఆరోగ్యయోధులకు సన్మానం చేసి ప్రభుత్వ ప్రసంశాపత్రం, మెమొంటో అందించారు. కార్యక్రమంలో గుంటూరు ఎక్సైజ్ డీసి అరుణ్ రావు, ప్రభుత్వ అధికారులు, నేతలు పాల్గొన్నారు.

ప్రభుత్వ సత్కారం పొందిన 'ఆరోగ్య యోధులు' వీరే..
కోవిడ్ వంటి ఆపత్కాలంలో బాధితులకు సకాలంలో సేవలందించి అరబిందో 108 హెల్త్ ఎమర్జెన్సీ ఆంబులెన్స్ సర్వీసుకు మంచి పేరు తెచ్చిన 28 మంది ఆరోగ్య యోధులకు ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ తరఫున సత్కారం, ప్రశంశాపత్రం జ్ఞాపికను ప్రభుత్వం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి 28 మంది ఉత్తమ ఉద్యోగులను సత్కరించారు. సత్కారం పొందిన వారిలో విజయనగరం జిల్లా నుంచి మద్దు భవాని (ఈ ఎం టీ), ఆర్, ధనుంజయ నాయుడు( ఈఎంటీ), ఎం. కోటేశ్వరరావు (పైలట్), విశాఖ నుంచి మనుమత్తు అప్పారావు (పైలట్), శ్రీకాకుళం జి.జగన్నాథరావు (పైలట్), ఎస్. నాగభూషణ్ రావు (ఎన్ని), పశ్చిమగోదావరి నుంచి జి. వెంకటరావు(ఈఎంటీ), గొర్రె వెంకట నరహరి(పైలట్), తూర్పు గోదావరి నుంచి పంపన విజయకుమార్ (ఈవెంటీ), కె.భీమశంకరావు (పైలట్), కృష్ణా జిల్లా నుంచి కె. కోటేశ్వరరావు (ఈఎంటీ), బొలెం ఆనంద్ (పైలట్). గుంటూరు జిల్లా నుంచి తెనాలి 2 పైలట్ డిఎల్ శ్రీనివాస్, కారంపూడి ఏఎంటీ మేకల వెంకటరరావు, నెల్లూరు జిల్లా నుంచి షేక్ ఖాదర్ బాషా (ఈఎంటీ), మబ్బు లక్ష్మయ్య (పైలట్), ప్రకాశం జిల్లా నుంచి ఎం. శ్రీనివాసరాజు (ఈఎంటీ), కె. ప్రభాకర్ రావు (పైలట్), దర్గా మస్తాన్ రావు (పైలట్), వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి జి. వరలక్ష్మి (ఈఎంటీ), పలుకూరి ఎరుకలయ్య (పైలట్), చిత్తూరు జిల్లా నుంచి మన్నేరి రాజు (పైలట్), సోమశేఖర్ (ఈఎంటీ). కర్నూలు జిల్లా నుంచి డి. జీవన్ (ఈఎంటీ), బి. గురుస్వామి (పైలట్), అనంతపురం నుంచి డి దాదా బాషా (ఈఎంటీ), దాసరి శేఖర్ (పైలట్), దర్గా మస్తాన్ వలి(ప్రకాశం), షేక్ హసన్ (గుంటూరు) ఉన్నారు.

-వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చైర్మన్
మద్యవిమోచన ప్రచార కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top