కొటియా గ్రామాలపై విచారణ వాయిదా

Adjournment of trial on Kotia villages - Sakshi

ఆర్టికల్‌ 131 చెల్లుబాటుపై తీర్పు వచ్చాకే నిర్ణయం

సుప్రీంకోర్టు స్పష్టీకరణ 

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొటియా గ్రామాలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ సీటీ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.

రెండు రాష్ట్రాల మధ్య అధికార పరిధికి సంబంధించిన ఆర్టికల్‌ 131 చెల్లుబాటును సవాల్‌ చేస్తూ ఒడిశా ఇప్పటికే ఓ వ్యాజ్యం దాఖలు చేసిందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్‌ తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్‌ కో ఆదేశాలు కొనసాగించాలని లేదంటే ఆర్టికల్‌ 131పై ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యం సహా రెండు అంశాలనూ ఒకేసారి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. ఆర్టికల్‌ 131పై ఒడిశా వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేశారు.  దీనిపై ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ స్పందిస్తూ.. తమకు అభ్యంతరం లేదని చెప్పారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top