AP: 3 నియోజకవర్గాల్లో 9,96,393 మంది పట్టభద్రులు

9,96,393 voters in 3 constituencies In andhra pradesh - Sakshi

సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరిగే మూడు పట్టభద్రు­లు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. 3 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో 9,96,393 మంది ఓటర్లు ఉండగా, రెండు టీచర్ల స్థానాల్లో 54,681 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం తెలిపారు.

శ్రీకాకుళం–విజయనగరం– విశాఖపట్నం పట్టభద్రుల నియో­జ­క­వర్గం నుంచి ఎంపిౖకైన పీవీఎన్‌ మాధవ్, ప్రకాశం–నెల్లూ­రు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎంపికైన వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెన్నపూస గోపాలరెడ్డి, ప్రకాశం–నెల్లూ­రు­–చిత్తూరు టీచర్ల నియోజకవర్గం నుంచి విఠపు బాల­సుబ్ర­మణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి కత్తి నరసింహారెడ్డిల పదవీ కాలం మార్చి 29,2023తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కొత్త ఓటర్ల జాబితాను సీఈసీ విడుదల చేసింది. నవంబర్‌1, 2022 నాటికి అర్హత ఉన్నవారికి ఓటు హక్కును కల్పిస్తూ కొత్త ఓటర్లను నవంబర్‌ 7 వరకు చేర్చుకొని నవంబర్‌ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు మీనా తెలిపారు.

ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నవంబర్‌ 23 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఆహ్వానించి, డిసెంబర్‌ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్లు, తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో ఆంధ్రా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. నామినేషన్లు వేసే 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలను స్వీకరించనుంది.

ఓటర్లు..పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య ఇదీ...
3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కలిపి 9,96,393 మంది ఓటర్లు ఉంటే అందులో అత్యధికంగా ప్రకాశం–నెల్లూరు­–చిత్తూరులో 3,83,396 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 320 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో 3,29,248 మంది ఓటర్లకు గాను 358 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం–విజయనగరం– విశాఖ నియోజకవర్గంలో 2,83,749 మంది ఓటర్లకు 297 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 26,907 ఓటర్లకు 175 పోలింగ్‌ స్టేషన్లు, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గంలో 27,774 మంది ఓటర్లకు 173 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top