ఉన్నత విద్యలో 4 కొత్త కోర్సులు

4 New Courses In Higher Education Says Adimulapu Suresh - Sakshi

ఈ ఏడాది నుంచి అమలు

247 కళాశాలలకు షోకాజ్‌ నోటీసులు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, అమరావతి: ఈ విద్యాసంవత్సరం నుంచి ఉన్నత విద్యలో నాలుగు కొత్త కోర్సుల్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఉన్నత విద్యను మరింత పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత విద్య ప్రణాళికామండలి (హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్లానింగ్‌ బోర్డు)తో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. రాష్ట్ర, సెంట్రల్‌ వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు పరస్పర భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాయన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది నుంచి.. పదినెలల ఇంటర్న్‌షిప్‌తో నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీ కోసం ఒక ఏడాది పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. నాలుగేళ్ల ఆనర్స్‌ డిగ్రీలో చేరి మూడేళ్లు మాత్రమే చదువుతానంటే డిగ్రీ లభిస్తుందని చెప్పారు.

నూతన విద్యావిధానంలో 70 శాతం చేరికలు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రాష్ట్రంలో ఉన్నత విద్యలో చేరికలు 90 శాతానికి పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఆధునికీకరిస్తున్నామన్నారు. నైపుణ్యాల కల్పన పెంపు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పరిశోధనల పెంపు లక్ష్యంతో ఎంఎస్‌ఎంఈ, నేషనల్‌ రీసెర్చి డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ తదితర సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఒక విభాగం ఏర్పాటుచేసి తొలిసారి అకడమిక్‌ ఆడిట్‌ చేపట్టామన్నారు. ఎనిమిది విశ్వవిద్యాలయాలను మల్టీ డిసిప్లిన్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామన్నారు. తొలివిడతలో శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా విశ్వవిద్యాలయాలు, జేఎన్‌టీయుకే, జేఎన్‌టీయుఏ, ఆర్జీయూకేటీలను, తదుపరి దశలో నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, పద్మావతి వర్సిటీలను రీసెర్చి వర్సిటీలుగా మారుస్తామని వివరించారు. నాలుగు వర్సిటీలను ప్రతిపాదించగా కడపలో వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ వర్సిటీ, కర్నూలులో క్లస్టర్‌ వర్సిటీ ఏర్పాటు చేశామని, టీచర్‌ ట్రయినింగ్‌ ప్రాధాన్యతతో ప్రకాశం వర్సిటీని తీర్చిదిద్దనున్నామని, అలాగే విజయనగరంలో వర్సిటీ ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 

48 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు
విద్యాసంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. ఉన్నత విద్యలో పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటించని 247 కళాశాలలకి షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, 48 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉన్నత విద్యలో ఈ విద్యా సంవత్సరం ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించామని, ఇంటర్‌లో వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. అవినీతికి తావులేకుండా వర్సిటీలలో పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తున్నామన్నారు. ఉన్నత విద్యలో ర్యాపిడ్‌ ఎడ్యుకేషన్‌ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 11న అమ్మఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ రామ్మోహనరావు, ప్రొఫెసర్‌ లక్ష్మమ్మ పాల్గొన్నారు.

విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం మండలి డైరీ ఆవిష్కరణ, మీడియా సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 19 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించిందన్నారు. ఈ పథకాలతో తమ ఉనికి పూర్తిగా కనుమరుగు అయిపోతోందన్న ఆందోళనతో తెలుగుదేశం సహ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి కుట్ర రాజకీయాలకు దిగుతున్నాయని విమర్శించారు.

దేవుళ్లని కూడా రాజకీయాల్లోకి లాగుతూ దిగజారిపోతున్నారని మండిపడ్డారు. రామతీర్థం విగ్రహ ధ్వంసంపై ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించిందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దోషులు ఎవరైనా సరే తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం అమ్మ ఒడి రెండోవిడత కార్యక్రమాన్ని ఈనెల 11న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చెప్పారు. రామతీర్థం ఘటనపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. తన హయాంలో సీబీఐని రాష్ట్రంలోకి రానీయని బాబు ఇప్పుడెలా సీబీఐ విచారణ అడుగుతారని ఆయన ప్రశ్నించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top