పామిడి: పట్టణ ఐకేపీ భవనాన్ని ఎన్ఆర్ఎల్ఎం (నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్) ఢిల్లీ బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా మండల సమాఖ్య నిర్వహణ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పోగ్రామ్ మేనేజర్ పంకజ్ సుయల్ మండల సమాఖ్య ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఎల్ఎం నిధుల సద్వినియోగంపై సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. కార్యక్రమంలో ఎస్ఈఆర్పీ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్రెడ్డి, ఆ సంస్థ పీఈ శోభ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు రాధారాణి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్ ‘కళ్యాణదుర్గం’
● ముగిసిన స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు
అనంతపురం: రెండు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ 2026 పోటీలు సోమవారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ను కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. సోమవారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఎర్రగుంట జెడ్పీహెచ్ఎస్, రన్నర్స్గా నెలగొండ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు నిలిచారు. హాకీ విన్నర్స్గా దురదకుంట జెడ్పీహెచ్ఎస్,రన్నర్స్గా పాల్తూరు జెడ్పీహెచ్ఎస్, ఫుట్బాల్ విన్నర్స్గా రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రన్నర్స్గా ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ నిలిచాయి. అథ్లెటిక్స్ విభాగంలో 600 మీటర్ల పరుగులో ప్రభంజన్ (ఉరవకొండ) బంగారు పతకం, అభిలాష్ (బీకేఎస్) సిల్వర్, రాజదీప్ నాయక్ (కళ్యాణదుర్గం) బ్రాంజ్ పతకాన్ని దక్కించుకున్నారు. వంద మీటర్ల పరుగులో కళ్యాణదుర్గం అభిరామ్కు బంగారు పతకం, రాయదుర్గం భానుతేజాకు వెండి పతకం, కార్తీక్ నాయక్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. లాంగ్జంప్లో శ్రీనాథ్ (కళ్యాణదుర్గం), టి.కార్తీక్ నాయక్ (అనంతపురం), భానుతేజ (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. 400 మీటర్ల పరుగులో సందీప్ (శింగనమల), కార్తీక్ (గుంతకల్లు), చందు (రాయదుర్గం) వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను దక్కించు కున్నారు. షాట్పుట్లో రంజిత్ (శింగనమల)కు బంగారు, హిమేష్ (ఉరవకొండ)కు వెండి, యశ్వంత్ (అనంతపురం)కు కాంస్య పతకం దక్కాయి. డిస్క్ త్రోలో ఉరవకొండ హిమేష్, గుంతకలుల తిరుదీప్, శింగనమల సందీప్ వరుసగా మూడు స్థానాల్లో నిలిచి పతకాలను కై వసం చేసుకున్నారు. 200 మీటర్ల పరుగులో రాయదుర్గం భానుతేజ (బంగారు), అనంతపురం కార్తీక్ నాయక్ (వెండి), కళ్యాణదుర్గం మంజునాథ్ (కాంస్య) పతకాలను దక్కించుకున్నారు. వంద మీటర్ల (4) రిలే పరుగులో శింగనమల, రాయదుర్గం, కళ్యాణదుర్గం క్రీడాకారులు వరుసగా బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. ముఖ్య అతిథులుగా కేజీఎఫ్ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ,డీఈఓ అయూబ్ హుస్సేన్,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.ఎం మంజుల, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ, ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల పాల్గొని పతకాలు అందజేశారు.


