ఉరవకొండ: నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూలైతో పోలిస్తే ఆగస్టు చివరి నాటికి అనేక రకాల సరుకుల ధరలు 40 నుంచి 75 శాతం వరకూ పెరిగాయన్నారు. బియ్యం, పప్పులు, పంచదార, నూనె, కూరగాయలు, వంటగ్యాస్ ఇలా అన్ని ధరలు ఆకాశాన్నంటాయన్నారు. గ్రామాల్లో కూలి పనులు తగ్గడంతో పాటు పట్టణాల్లో ఉపాధి దొరక్కపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. వైద్యం, ఇతర ఖర్చులు పెరగడంతో పేద, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. ప్రతి కుటుంబంపై సగటున రూ. 4 వేల నుంచి రూ.7 వేల అదనపు భారం పడిందన్నారు. జీఎస్టీ 2.0తో నిత్యావసరాల ధరలు తగ్గి ఊరట లభిస్తుందని చంద్రబాబుతో పాటు కూటమి పార్టీల నేతలు గొప్పలు చెప్పారని, క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొని పేదలకు రేషన్ షాపుల ద్వారా పంచదార, పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు వంటివి అందించి ఆదుకోవాలని కోరారు.
చంద్రబాబు సర్కారుపై
ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఆగ్రహం


