బొమ్మనహాళ్: నేమకల్లు అంజన్న ఉత్సవం, బ్రహ్మ రథోత్సవం కమనీయంగా సాగింది. శ్రావణ మాసం ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నేమకల్లు ఆంజనేయస్వామి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భభక్తులు పెద్ద ఎత్తున ఉత్సవంలో పాల్గొన్నారు. బాలాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక అలంకరణ, ఆకుపూజ, గంగాభిషేకం, బంగారు కిరీటం, వెండి పాదాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహామంగళ హారతి, ప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు సునీత, శివారెడ్డి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి బ్రహ్మ రథంపై కొలువు దీర్చారు. ఈ సందర్భంగా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు రథాన్ని లాగారు. చుట్టు పక్కన ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు బ్రహ్మ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత లంకాదహనం కార్యక్రమం జరిగింది. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


