● కలెక్టర్ ఓ.ఆనంద్
గుత్తి రూరల్: రైతులకు పశుగ్రాసం కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. మండలంలోని శ్రీపురం గ్రామ శివారులో ఉన్న చెరువులో 25 ఎకరాల్లో చేపట్టిన సామూహిక పశు గ్రాస పెంపకాన్ని కలెక్టర్ ఆనంద్ గురువారం ప్రారంభించారు. రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. రైతులు 10 లేదా 20 సెంట్లలో గడ్డి పెంచుకుంటే పశు గ్రాసం కొరత అసలు ఉండదని, తద్వారా ఆదాయం కూడా వస్తుందన్నారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
శ్రీపురం గ్రామంలో అధికారులపై కలెక్టర్ మండి పడ్డారు. గ్రామంలో వ్యవసాయం, పంటల సాగు, పశు సంపద తదితర విషయాలపై ఏడీఏ వెంక ట్రాముడు, ఏఓ ముస్తాక్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ ఆరా తీయగా, వారు సరైన సమాధానం చెప్పలేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాలు 30 శాతం మంది రైతులకు కూడా తెలియడం లేదని, అధికారులు ఏ మాత్రం పని చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ ప్రేమ్ చంద్, వెటర్నరీ డీడీ రమేష్రెడ్డి, ఏడీ భారతి పాల్గొన్నారు.
నీటి సరఫరా పనులు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: తాగునీటి సరఫరా పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. పీఏబీఆర్ వద్ద ఫిల్టర్ బెడ్స్ పనులు మొదలు కాకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఆత్మకూరు వద్ద ఓహెచ్ఎస్ఆర్, సంప్, పంప్ హౌస్ నిర్మాణం ప్రారంభించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే సునీత, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులున్నారు.
‘సర్’ విచారణ వేగవంతం
అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి ఓటర్ల విచారణ ప్రక్రియను వేగవంతం చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ తెలిపారు. సీఈఓ గురువారం వెలగపూడి నుంచి కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విచారణకు సంబంధించి 1,22,601 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఓటరు నమోదుకు 11,327 దరఖాస్తులు, ఓటు తొలగింపునకు (ఫారం–7) 242, వివరాల చేర్పు–మార్పునకు (ఫారం–8) సంబంధించి 9,044 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయన్నారు.


