జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పచ్చదనం మాయమైంది. భూములు బీళ్లుగా మారాయి. కొండగుట్టలు.. బోడిగా మారిపోయాయి. పచ్చి గడ్డి లేక మూగజీవాలు విలవిలలాడుతున్నాయి. చివరకు గొంతు తడుపు కునేందుకు గుక్కెడు నీటికీ కటకటమనే పరిస్థితులు నెలకొనడంతో మూగజీవాల వేదన వర్ణనాతీతంగా మారింది. చివరకు వ్యవసాయ బోరు బావుల వద్ద కూడా నీరు లభ్యం కావడం లేదని గొర్రెల కాపరులు వాపోతున్నారు.
సాగునీటికీ కటకటే
ఎల్–నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి నీటి లభ్యత తక్కువగా ఉంటుందని అధికారులు ఆయకట్టుకు నీరు వదలడం లేదు. తుంగభద్ర నుంచి, హంద్రీ–నీవా నుంచి సాగునీరు వదలకపోవడంతో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.


