● తోపులాటలో అపస్మారక స్థితిలోకి మహిళ
పత్తికొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన సోమవారం సాయంత్రం పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకుంది. గుంతకల్లులోని ధర్మవరం గేట్కు చెందిన హసీనా తన కుమారుడు దాదా పీరాతో కలిసి ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం కర్నూలుకు వెళ్లింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకొని తిరిగి కర్నూలు నుంచి ఆర్టీసీ బస్సు (ఏపీ39యూఎల్1662)లో గుంతకల్లుకు బయలుదేరింది. కూర్చోవడానికి సీటు కూడా దొరికింది. అయితే సాయంత్రం సమయంలో బస్సు పత్తికొండ బస్టాండ్కు రాగానే వాష్రూమ్ కోసం కిందకు దిగింది. ఆ సమయంలో గుంతకల్లు వైపు బస్సులు తక్కువగా ఉంటాయి. దీనికితోడు దాదాపు 3 గంటలు పాటు గుంతకల్లు వైపు వెళ్లే బస్సులు రాలేదు. దాదాపు 200 మంది ప్రయాణికులు గుంతకల్లు వైపు వెళ్లడానికి బస్టాండ్లో నిరీక్షిస్తున్నారు. దీంతో వచ్చిన బస్సు కోసం ప్రయాణికులు చుట్టుముట్టారు. ఈక్రమంలో వాష్రూమ్ ముగించుకొని బస్సు ఎక్కుతున్న సమయంలో రద్దీ కారణంగా ప్రయాణికులు తోసుకున్నారు. దీంతో హసీనా అక్కడే స్పృహతప్పి పడిపోయింది. బస్సులో ఉన్న కుమారుడు దాదాపీరా ఆమెను పత్తికొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయినా ఆర్టీసీ సిబ్బంది తమకేమీ సంబంధం లేనట్లు ఆమెను కిందకు దింపి వెళ్లిపోవడం గమనార్హం.


