నేడు చంద్రబాబు రాక
అనంతపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అనంతపురం రానున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె వివాహం స్థానిక బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో జరగనుంది. ఈ వివాహానికి సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పటిష్ట బందోబస్తు
అనంతపురం సెంట్రల్: సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయ ఆవరణలో బందోబస్తుకు హాజరయ్యే పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి కల్యాణమంటపం వరకు సీఎం ప్రయాణించే మార్గాల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా గట్టి బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు, రూట్ బందోబస్తు, హెలిప్యాడ్ వద్ద భద్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం సీఎం కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు.
కసాపురానికి పోటెత్తిన భక్తజనం
గుంతకల్లు రూరల్: శ్రావణ మాస మూడో శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాత్రి సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గజ వాహనంపై కొలువదీర్చి ఈఓ మేడేపల్లి విజయరాజు, ఏఈఓ వెంకటేశ్వర్లు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


