● ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్
అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం కల్చరల్ : విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేస్తున్న పాలకుల విధానాలను ప్రశ్నించాలని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కులను అణిచివేస్తే సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చరించారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్లో శనివారం నిర్వహించిన ‘జెన్–జీ’ బహిరంగ సభలో ఆమె ముఖ్య వక్తగా ప్రసంగించారు. 12 ఏళ్లుగా పాలకుల విధానాలతో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం, పోటీ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై పేరుకుపోయిన ఆగ్రహానికి జంతర్ మంతర్ ఉద్యమం ప్రతిరూపమన్నారు. నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఐషీ ఘోష్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్నకుమార్, ఓతూరు పరమేష్, జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, వైఎస్సార్ కడప జిల్లా కార్యదర్శి రవి, సత్యసాయి జిల్లా కార్యదర్శి నాగార్జున, నాయకులు పాల్గొన్నారు.
జవాబుదారీతనం వచ్చేంత వరకూ పోరు
కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారి తనం వచ్చే వరకూ పోరు ఆగదని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్ అన్నారు. శనివారం స్థానిక లలిత కళాపరిషత్లో విశ్వ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేధావులతో ముఖాముఖి కార్యక్రమం ఆలోచనాత్మకంగా సాగింది. జెన్ జీ ఉద్యమ నేపథ్యంలో అనంతకొచ్చిన ఐషీ ఘోష్ మాట్లాడుతూ యువత చేసిన ఉద్యమంలో నిబద్దత ఉంది కాబట్టే కేంద్ర విద్యామంత్రి దిగొచ్చారని గుర్తు చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, విశ్వ విజ్ఞాన కేంద్రం ప్రతినిధి రాజ్ మోహన్ మాట్లాడారు.
ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో మాట్లాడుతున్న ఐషీ ఘోష్, హాజరైన విద్యార్థులు


