రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ బళ్లారి రోడ్డులో శనివారం రాత్రి దారుణ హత్య జరిగింది. పాపంపేటకు చెందిన ఓ యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని పోలీసులు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన మఠం సోమశేఖర్కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మఠం భరద్వాజ్ (30) అలియాస్ భరత్. అవివాహితుడైన భరత్పై బళ్లారి రోడ్డులోని లలితానగర్ ఆరాధ్య హోమ్స్ సమీపంలోని గుజరీ దుకాణం పక్కన శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో తలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో కుడిచేయి మోచేతి వరకు పూర్తిగా తెగిపోయింది. అనంతపురం రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భరత్ను అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు. బళ్లారి రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వివాహితతో భరత్ కొంతకాలంగా సన్నిహితంగా తిరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు లేదా మరెవరైనా దాడికి పాల్పడ్డారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీఐ శ్రీకాంత్యాదవ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.


