బెళుగుప్ప: వరుణుడి కరుణ కోసం మండల పరిధిలోని బెళుగుప్ప తండాలోని గిరిజనులు శుక్రవారం గాడిదలకు పెళ్లి చేశారు. ముందుగా గాడిదలకు పసుపు, కుంకుమలను పూసి పూల హారాలతో అలంకరించి గిరిజన సాంప్రదాయాలతో మంత్రోచ్ఛరణల మధ్య పెళ్లి తంతు చేశారు. అనంతరం బెళుగుప్ప తండా, బెళుగుప్ప గ్రామాల్లో గాడిదలను ఊరేగించారు.
బీజేపీ నేత మోసం చేశాడని ఫిర్యాదు
పామిడి: అమాయకురాలైన తనను నమ్మించి ఇంటి స్థలాన్ని రాయించుకోవడంతో పాటు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టించి మోసం చేశాడంటూ స్థానిక గాయత్రీ కాలనీవాసి, నారాయణ భార్య చితంబరమ్మ పామిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు... తనకు వరుసకు మనువడైన బీజీపీ నేత రాజశేఖర్గౌడ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన వద్దకు వచ్చి నిరక్ష్యరాసురాలినైన తనను నమ్మించి స్థానిక గాయత్రి కాలనీలో ఉన్న 3 సెంట్ల స్థలాన్ని తన పేర రిజిష్టర్ చేయించుకున్నాడన్నారు. అలాగే తనకు సంబంధించిన 8 తులాల బంగారును బ్యాంకులో పెట్టి లోన్ తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే తాను బీజేపీ నేతనంటూ బెదిరింపులకు పాల్పడటంతో పాటు దాడికి దిగుతున్నాడన్నారు. పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.


