● పోలీస్ స్టేషన్ పక్కనే ఘటన
పెద్దవడుగూరు : విపక్ష వైఎస్సార్సీపీ నాయకులపై ‘పచ్చ’ గూండాలు మరోమారు రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే దాడులకు తెగబడ్డారు. పోలీసుల ప్రేక్షకపాత్రపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నవడుగూరులో ఇటీవల వైఎస్సార్సీపీ నేత మదన్మోహన్రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఆ సమయంలో ఇరు వర్గాలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లోని వారిని శనివారం కోర్టుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించేందుకు పార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ గూడూరు సూర్యనారాయణరెడ్డి, నాయకులు లక్ష్ముంపల్లి రాంభూపాల్రెడ్డి (బాబు), కొండూరు దేవమోహన్రెడ్డి, కాశేపల్లి రామాంజులరెడ్డి, భీమునిపల్లి రామచంద్రారెడ్డి తదితరులు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్ పక్కనే ఉన్న ఓ కేఫ్ వద్ద టీ తాగుతుండగా జేసీ వర్గీయులైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్లల్లో అక్కడికి చేరుకుని కుర్చీలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో గూడూరు సూర్యనారాయణరెడ్డి తీవ్ర గాయాల పాలుకాగా, రాంభూపాల్రెడ్డి(బాబు)కి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ వర్గీయులను అక్కడి నుంచి పంపించారు. దాడిలో గాయపడిన వారిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగానే పచ్చ గూండాలు రెచ్చిపోయి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసిన వారిని కారులో ఎక్కిస్తున్న పోలీసులు, గాయపడిన గూడూరు సూర్యనారాయణరెడ్డి


