పెద్దపప్పూరు: మండల కేంద్రంలోని దుర్గావైన్స్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు 35 కేసుల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. షాపులోని సీసీ టీవీల్లో తమ ముఖాలు కనిపించకూడదనే ఉద్దేశంతో చాకచక్యంగా పొగబెట్టిన అనంతరం ధ్వంసం చేయడం గమనార్హం. శనివారం ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
విద్యతోనే ఉన్నత శిఖరాలు
అనంతపురం టవర్క్లాక్: విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణయ్య అన్నారు. శనివారం స్థానిక జయమణెమ్మ కల్యాణ మండపంలో నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా పీవీ రమణయ్య మాట్లాడుతూ విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాలు ఏర్పరచుకుని పట్టుదల, క్రమశిక్షణతో వాటిని అధిరోహించాలన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సంఘం ఎప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రంగయ్య, నాయకులు బాలతాత పాల్గొన్నారు.
పందుల పెంపకందారుడిపై దాడి
కళ్యాణదుర్గం: పందుల పెంపకందారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. పట్టణానికి చెందిన ఎరుకుల రాము దొడగట్ట రోడ్డులో షెడ్డు ఏర్పాటు చేసుకుని పందులు పెంచుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పందుల షెడ్డులోకి చొరబడ్డారు. అలికిడి కావడంతో రాము అప్రమత్తమై దుండగులను అడ్డుకోగా.. అతడిపై దాడికి దిగారు. విషయం కుటుంబ సభ్యులు, స్నేహితులకు చేరవేయగా, వారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే దుండగులు కొన్ని పందులను ఎత్తుకుని పారిపోయినట్లు రాము తెలిపాడు. గాయపడిన రామును కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్క దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
రాయదుర్గంటౌన్: కుక్క దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన ఘటన పట్టణంలోని గ్యాస్ గౌడోన్ కాలనీలో శనివారం సాయంత్రం జరిగింది. ఇంటి బయట నిల్చుని ఉన్న లింగమ్మ చేయి, కాలిని కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణంలో ఈ నెల 4న పిచ్చికుక్క దాడిలో 30 మంది గాయపడగా తాజాగా మరోసారి కుక్కదాడిలో మహిళ గాయపడడం గమనార్హం. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మచ్చా దత్తారెడ్డి
మెరుపు సెంచరీ
అనంతపురం టౌన్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలో జరుగుతున్న సీనియర్ జోనల్ క్రికెట్ పోటీల్లో రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టుపై అనంతపురం జట్టు ఘన విజయం సాధించింది. జట్టుకు చెందిన మచ్చా దత్తారెడ్డి మెరుపు సెంచరీ చేశాడు. 106 బంతుల్లో 15 సిక్సర్లు 9 ఫోర్లతో 161 పరుగులు సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 417 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్జోన్ జట్టు 323 పరుగులకే కుప్పకూలడంతో 94 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. జట్టులో అర్జున్ టెండూల్కర్ 85 పరుగులు, గిరినాథ్రెడ్డి 74, హానిష్ వీరారెడ్డి 29 పరుగులతో ప్రతిభ కనబరిచారు.


