బెళుగుప్ప: రోడ్డు ఆక్రమణపై ఫిర్యాదు చేశారని వైఎస్సార్సీపీ మద్దతుదారులపై ‘పచ్చ’ మూక దాడికి తెగబడింది. ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి దాడులతో భయానక వాతావరణ సృష్టించింది. బాధితుల కథనం మేరకు... గుండ్లపల్లిలోని శివాలయం వద్ద నివాసాలకు వెళ్లే రోడ్డును టీడీపీ నాయకుడు క్రిష్టప్ప ఆక్రమించి మరుగుదొడ్డి నిర్మాణానికి గుంతలు తవ్వించాడు. రోడ్డును ఆక్రమించి కట్టుకుంటే ఇబ్బంది అవుతుందని గ్రామపెద్దలు అభ్యంతరం తెలిపారు. అయినా లెక్క చేయలేదు. దీంతో ఈ నెల 7న పోలీసులకు, సచివాలయ అధికారులకు వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోక పోవడంతో క్రిష్టప్ప ఈసారి గుంతల్లోకి రింగులు దించాడు. రోడ్డు పూర్తిస్థాయిలో బంద్ అవుతుండటంతో సోమవారం మరోమారు ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు క్రిష్టప్ప, గోవిందు, కరెప్ప, ఐదుకల్లు క్రిష్ట, భానుప్రసాద్, విరుపాక్షి, బంతి క్రిష్ట ఆగ్రహంతో ఈశ్వరప్ప ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కుటుంబ సభ్యులను బయటకు ఈడ్చుకెళ్లి దాడి చేశారు. అంతు చూస్తాం అంటూ బెదిరించారు. దాడిలో ఈశ్వరప్ప, అతని కుమారుడు మంజునాథ, కుమార్తె నిమిత గాయపడ్డారు. తమకు జరిగిన అవమానం.. అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, రక్షణ కల్పించాలని కోరారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. అనంతరం బాధితులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు.
దాడి సరికాదు
ఇళ్ల మధ్య దశాబ్దాలుగా ఉన్న దారిని ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా ఫిర్యాదు చేశారన్న అక్కసుతో ఈశ్వరప్ప కుటుంబంపై టీడీపీ నాయకుడు క్రిష్టప్ప మరికొంతమందితో కలిసి దాడి చేయడాన్ని సర్పంచ్ పురుష్తోతం, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మచ్చన్న ఖండించారు. అమ్మాయని చూడకుండా దాడిచేయడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టి.. బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
గుండ్లపల్లిలో టీడీపీ నేత రోడ్డు ఆక్రమించి బాత్రూమ్ నిర్మాణం
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారు కుటుంబంపై ఆగ్రహం
ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులను ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా దాడి


