అనంతపురం: ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కరెంటు కోత రోగులను ఇబ్బందులకు గురి చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల స్నాతకోత్సవం నిర్వహించారు. ఆ రాత్రి విధుల్లో ఉన్న ఎలక్ట్రీషియన్లు శనివారం ఉదయం 10 గంటల వరకు రాలేదు. దీంతో ఓపీ చీటీలు ఇవ్వడానికి అవరోధం ఏర్పడింది. ఈ క్రమంలో రోగుల క్యూ భారీగా పెరిగిపోయింది. షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన ఆపరేషన్లను కాస్తా సోమవారానికి వాయిదా వేశారు. వాస్తవానికి ముగ్గురు ఎలక్ట్రీషియన్లు సూపర్ స్పెషాలిటీలో విధులు నిర్వహించాల్సి ఉంది. వీరిలో ఇద్దరు ఆడవారు కావడంతో.. వాచ్మెన్ విధులకే పరిమితయ్యారు. ఉదయం పది తర్వాత కరెంటు పునరుద్ధరించారు. అప్పటి వరకు రోగులు పడిన అవస్థల గురించి కలెక్టర్ ఆనంద్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆ ఇద్దరినీ బదిలీ చేశారు. ఒకరిని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, మరొకరిని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి బదిలీ చేశారు. నైపుణ్యం ఉన్న ఎలక్ట్రీషియన్లనే సూపర్స్పెషాలిటీకి బదిలీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.


