అనంతపురం: యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి పసిపిల్లల మరణాలు మరింత బాధాకరమన్నారు. యుద్ధం అనేది ఎన్నటికీ సమస్యకు పరిష్కారం కాదన్నారు. అంతేకాక ప్రపంచ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయన్నారు. ఈ యుద్ధాల వల్ల మానవ మనుగడకు ఆటంకం కలుగుతుందన్నారు. ఆధిపత్య పోరులో ఆయుధాల వ్యాపారులకు తప్ప ఇతరులకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఆయా దేశాలు గ్రహించాలని కోరారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాలపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వేల సంవత్సరాల నుంచి భారతదేశానికి ఇరాన్కు మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు.
మెడికల్ షాపుల్లో తనిఖీలు
రాయదుర్గం టౌన్: పట్టణంలోని పలు మెడికల్ షాపుల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా అసిస్టెంట్ డైరక్టర్ వీరకుమార్రెడ్డి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు మాధవి, కేశవరెడ్డి మూడు బృందాలుగా విడిపోయి బళ్లారి రోడ్డులోని దాదాపు ఐదారు మెడికల్ షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బిల్లులు నిర్వహణ, స్టాక్ రిజిస్టార్లు, రికార్డులు, జీఎస్టీ తగ్గింపు మేరకు విక్రయాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు నిషేధిత మందుల విక్రయాలు, నిల్వలను పరిశీలించారు. నిబంధనలు పాటించని ఐదు దుకాణాదారులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తనిఖీల విషయం తెలియగానే రాయదుర్గంలోని పలు మెడికల్ షాపులకు తాళం వేసి నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లారు.
సాకే శైలజానాథ్


