● రెండేళ్లలో వరుసగా నాలుగో సారి ఘటన
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోనూ ప్రఖ్యాతి గాంచిన రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. తలుపులు ధ్వంసం చేసి ఆలయంలోకి చొరబడిన దుండగులు సుమారు రూ.లక్షకు పైగా విలువ చేసే అమ్మవారి వెండి ఆభరణాలను అపహరించారు. టీడీపీ ప్రభుత్వమేర్పడిన ఈ రెండేళ్లలో వరుసగా నాలుగోసారి చోటు చేసుకున్న చోరీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓ కుటుంబం కబంధహస్తాల్లో ఉన్న ఈ ఆలయాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చింది. అనంతరం ఆలయం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. భక్తులకు సౌకర్యాల కల్పనతో పాటు వారి భద్రతకు అన్ని చర్యలూ తీసుకున్నారు. అయితే ఈ రెండేళ్లలో ఆలయానికి భద్రత కరువు కావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


