అనంతపురం అర్బన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్, మైభారత్, యువజన వ్యవహారాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్న ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్–5కే రన్’ కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ శుక్రవారం తన చాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మాదక ద్రవ్యాలు సేవిచడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయనేదానిపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నషా ముక్త్ అభియాన్ లక్ష్యాలను ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడం కోసం 5కే రన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఆదివారం ఉద యం అనంతపురంలోని క్లాక్టవర్ వద్ద ప్రారంభమై సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, సంగమేష్ సర్కిల్, కలెక్టరేట్ మీదుగా జేఎన్టీయూ వరకు 5కే రన్ కొనసాగుతుందన్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ‘డ్రగ్స్ రహిత అనంతపురం–డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం’లో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గెలుపొందిన వారికి బహుమతి
5కే రన్ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.11 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. అదనంగా ఐదుగురికి రూ.3 వేలు చొప్పున కొన్సలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ మమ త, మై భారత్ ప్రతినిధి బిసాతి భరత్, ప్రోగ్రామ్ సూపర్వైజర్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాతి జీవన్కుమార్, జయమారుతి, వలంటీర్లు శేషాద్రి, అంబరీష్బాబు పాల్గొన్నారు.


