● నిలిచిపోనున్న రీ–సర్వే ప్రక్రియ
అనంతపురం అర్బన్: న్యాయమైన కోర్కెల సాధనకు గ్రామ సర్వేయర్లు పోరుబాట పట్టారు. మార్చి 4వ తేదీలోపు డిమాండ్లు పరిష్కరించకపోతే 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ పాటిస్తామని గత నెల 25న గ్రామ సర్వేయర్ల సంఘం నాయకులు ప్రభుత్వ పెద్దలకు నోటీసు ఇచ్చారు. అయితే వారి డిమాండ్లు పరిష్కరించే విషయంలో సర్కారు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో గురువారం నుంచి సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో నాల్గో విడత కింద జిల్లాలో 90 గ్రామాల్లో చేపట్టిన రీ–సర్వే నిలిచిపోనుంది.
జనవరి 27న తొలిసారి..
డిమాండ్ల పరిష్కారం కోసం తొలిసారి ఈ ఏడాది జనవరి 27న సర్వేయర్లు సహాయ నిరాకరణ చేపట్టారు. జనవరి 30న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అధ్యక్షతన గ్రామ సర్వేయర్ల రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. స్వర్ణ గ్రామ వ్యవస్థలో సహచర సాంకేతిక ఉద్యోగులతో సమాన పేరోల్లో బేసిక్ పే, పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి 15వ తేదీన ప్రతిపాదనల నివేదిక తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రీ–సర్వే నిర్వహణకు ప్రతి గ్రామానికి ఒక ల్యాప్టాప్, రోవర్, ప్రతి మండలానికి ఒక ప్రింటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రీ–సర్వే బిల్లులు ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామన్నారు. కానీ, హామీలు అమలు కాకపోవడంతో తాజాగా మరోసారి సర్వేయర్లు సహాయ నిరాకరణకు దిగారు.
డిమాండ్లు పరిష్కరించే
వరకు కొనసాగింపు
సర్వేయర్ల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలు కావు. పేస్కేల్ మార్చకుండా పోస్టు పేరు మారిస్తే నయాపైసా ప్రయోజనం ఉండదు. డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ చేపడతామని గత నెల 25న నోటీసులిచ్చినా సానుకూల స్పందన రాలేదు. దీంతో ఉద్యమబాట పట్టాం. డిమాండ్లు పరిష్కరించే వరకు కొనసాగిస్తాం.
– మహేష్నాయుడు, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, గ్రామ సర్వేయర్ల సంఘం


