అనంతపురం టౌన్: ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. మంగళవారం ఆ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు పాల్గొని జిల్లా అధ్యక్షుడిగా ఎన్.షామీర్బాషా, ఉపాధ్యక్షుడిగా శివనారాయణశర్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎండీ యూనస్, జాయింట్ సెక్రెటరీగా జయదీప్, ట్రెజరర్గా బసవరాజ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వాహనంలో నుంచి
కిందపడిన కూలీలు
ఉరవకొండ/రూరల్: సామర్థ్యానికి మించి కూలీలతో వెళుతున్న వాహనం వెనుక డోర్ తెరుచుకోవడంతో శ్రామికులు ఒక్కసారిగా రోడ్డుపై పడి గాయపడ్డారు. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కణేకల్లు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన 20 మంది కూలీలు మంగళవారం ఉదయం టాటా ఏస్ వాహనంలో మిరప పంట కోత పనికి నింబగల్లుకు బయలుదేరారు. నింబగల్లు గ్రామ పరిసరాల్లోకి చేరుకోగానే వాహనం వెనుక డోర్ తెరుచుకుంది. దీంతో కూలీలు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి క్షతగాత్రులను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ మహిళా కూలీని అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు.
జిల్లాకు 1470 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం సెంట్రల్: ఇఫ్కో కంపెనీకి చెందిన 1,470 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చినట్లు వ్యవసాయశాఖ ఏడీ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. మంగళవారం రైలు వ్యాగన్లలో వచ్చిన యూరియా నిల్వలను ఆయన పరిశీలించారు. వచ్చిన యూరిలో 470 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్కు, 1000 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు పంపిణీ చేయనున్నట్లు ఆయన వివరించారు.


