● ప్రజాబలం వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్
● రథయాత్రతో గ్రామాల్లో సంతకాల సేకరణ ప్రారంభం
బెళుగుప్ప: ఐదు దశాబ్దాలుగా జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాబలం వ్యవస్థాపక అధ్యక్షుడు రామప్ప నాయక్ డిమాండ్ చేశారు. ‘ఆర్డీటీని కాపాడుకుందాం’ అనే నినాదంతో సంతకాల సేకరణకు చేపట్టిన రథయాత్ర మంగళవారం బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండాలో గ్రామ పెద్దలతో కలసి ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఆర్డీటీ సేవలను కొనియాడారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రథయాత్ర కొనసాగిస్తూ ప్రజలను చైతన్య పరిచి ఆర్డీటీ పరిరక్షణకు సంతకాల సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 8న కలెక్టరేట్ వద్ద భారీ సభతో ముగుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాబలం రాష్ట్ర కన్వీనర్ రమేష్, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ మైమున, ఉరవకొండ కన్వీనర్ హనీఫ్, గ్రామ పెద్దలు వేణుగోపాల్ నాయక్, బలరాం నాయక్, గోపాల్నాయక్, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.


