చేనేత కార్మికుడి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని టీచర్స్కాలనీలో నివాసముంటున్న గుర్రం చంద్రశేఖర్ (40)కు భార్య శశికళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ముడి సరుకు, కుటుంబ పోషణకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో తాను తయారు చేసిన చీరలకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం నిద్రలేచిన మృతుని భార్య శశికళ.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భర్తను చూసి బోరున విలపించింది. రెండో పట్టణ సీఐ రెడ్డప్ప దర్యాప్తు చేపట్టారు.


